
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా కట్టడి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సామాన్య ప్రజానికానికి చేదోడు వాదోడుగా ఉంటూ పలు రాజకీయ పార్టీలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నాయి. నిత్యవసర సరకులను ఉచితంగా ఇస్తూ.. ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా వారి వారి స్థాయికి తగ్గట్లుగా సేవలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత.. మద్యం తరలిస్తూ ఢిల్లీ పోలీసులకు చిక్కాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూత్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో పాటు.. కర్నాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. వీరు హర్యాణా నుంచి ఢిల్లీకి మద్యం తరలిస్తుండగా సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వాహనాలను చెక్ చేస్తుండగా.. కాంగ్రెస్ నాయకులు సదరు కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న కారులో 12 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఢిల్లీ ఎక్సైజ్ చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం సరఫరా చేయడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీరియస్ అయ్యారు. అత్యవసర సేవల పాస్ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలపై పార్టీ పరంగా కూడా దర్యాప్తు చేయాలన్నారు.