ఆ 8 గ్రామాలను దత్తత తీసుకున్న మోహన్బాబు
నిరుపేద ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం పేదవారి ఆకలిబాధ తీర్చేందుకు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు...
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. 21 రోజుల పాటు ప్రజలేవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించింది. కాదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అన్ని రంగాలకి చెందిన ఎంతోమంది నిరుపేద ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం పేదవారి ఆకలిబాధ తీర్చేందుకు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు మోహన్బాబు కుటుంబీకులు. మోహన్బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రోజుకు రెండు పూటలా ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ఇలా ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. ఇది కాకుండా ఎనిమిది టన్నుల కూరగాయలను ఈ గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సొంత జిల్లా ప్రజల కోసం మోహన్ బాబు మాస్కులు, శానిటైజర్లను కూడా అందిస్తున్నారు. మరోవైపు మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్ తన టీం సభ్యులని తెలుగు రాష్ట్రాలకి పంపి పేద వారికి ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. ఈ విపత్కర సమయాల్లో మోహన్ బాబు ఫ్యామిలీ చేస్తున్న సేవను నెటిజన్లు కొనియాడుతున్నారు.