
హైదరాబాద్, జూన్ 26: రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 31,736 మంది విద్యార్థులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 27,857 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇక తాజాగా ఫలితాల్లో వీరిలో 23,013 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 82.61 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నమాట. వీరిలో బాలురు 81.29 శాతం మంది, బాలికలు 84.87 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఈ మేరకు ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ విడుదల చేశారు.
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఇక వికారాబాద్లో కేవలం 44.43 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు బాలురు 17,568 మంది హాజరు కాగా, 11,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలికలు 10,289 మంది పరీక్ష రాయగా.. 8,732 మంది పాస్ అయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఈ కింది అధికారిక వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక జూన్ 26 నుంచి జులై 5 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన అభ్యర్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికెషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వీరంతా తమ దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్ ఫీజు రూ.500, రీ వెరిఫికేషన్ ఫీజు రూ.1,000గా అధికారులు వెల్లడించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేయదల్చుకునేవారు హాల్టికెట్ జిరాక్స్, కంప్యూటరైజ్డ్ మార్కుల మెమో తప్పనిసరిగా జత చేయాలి. దరఖాస్తులను కేవలం ఆన్లైన్లోనే సమర్పించాలి. ఆఫ్లైన్లో లేదా పోస్టు ద్వారా పంపే దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.