
హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ 2) పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎస్ఏ 2 పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు టైంటేబుల్ను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10 నుంచి విద్యార్ధుకలు ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అయితే ఏ రోజు పరీక్షల సమాధాన పత్రాలను ఆ రోజే మూల్యాంకనం చేసి ఎస్ఏ 2 మార్కుల అప్లోడ్ ప్రక్రియను కూడా ఏప్రిల్ 10 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు విద్యార్థుల మార్కులను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని విద్యాశాఖ జిల్లా అధికారులకు సూచించింది. పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీతో ముగుస్తాయి. అనంతరం ఎస్ఏ 2 ఫలితాలను ఏప్రిల్ 23న ప్రకటించి అదే రోజు తల్లిదండ్రులు- ఉపాధ్యాయులతో పీటీఎం సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవుతాయి. ఈ క్రమంలో వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాదికి వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు రానున్నాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి గానూ స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముందే ప్రకటించడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ట్రైన్, బస్సు టికెట్లు బుక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.