
హైదరాబాద్, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం (మే 19) విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచింది. మే 22, 23 తేదీల్లో హైదరాబాద్ వెంగల్రావు నగర్లోన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న వారంతా ఈ వెరిఫికేషన్కు హజరుకావల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతోపాటు, కమ్యునిటీ, ఇతర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు హాజరు కావాలని బోర్డు సూచించింది. ఏవైనా కారణాల చేత మే 22, 23వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కాలేని అభ్యర్ధులు మే నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చునని బోర్డు స్పష్టం చేసింది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం 34 డిపార్ట్మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్తేషియా డిపార్ట్మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు కూడా అందజేశారు. మిగిలిన 30 డిపార్ట్మెంట్లలోని 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ను తాజాగా విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను MHSRB విడుదల చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.