
హైదరాబాద్, మే 4: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అకడమిక్ పరీక్షలు ముగిసి వేసవి సెలువులు కూడా ప్రారంభమైనాయి. ఇక ఉన్నత విద్యల్లోకి ప్రవేశాలకు వరుస ఎంట్రన్స్ టెస్ట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాన రాష్ట్రంలో ఒకే రోజు రెండు పరీక్షలు వచ్చాయి. మే నెల 25న ఒకేరోజు రెండు పరీక్షలు ఉండటంతో పలువురు విద్యార్థులకు ఏ పరీక్ష రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఆరోజు డీఈఈసెట్ ఉండగా.. అదేరోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గణితం, జువాలజీ, చరిత్ర సబ్జెక్టుల పరీక్షలు జరగనున్నాయి. మే 25న ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు నిర్వహించే డీఈఈసెట్ 2025 పరీక్ష ఉంది. ఈ పరీక్షకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులు మాత్రమే హాజరవుతారు.
అయితే ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాలల్లో కొందరు ఒకటీ రెండు సబ్జెక్టుల్లో తప్పినందున.. వారందరికీ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెలలోనే జరగనున్నాయి. ఇప్పుడు డీఈడీ పరీక్ష, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రెండు సరిగ్గా ఒకే రోజు వచ్చాయి. దీంతో డీఈడీ చదవాలనుకుంటున్న విద్యార్ధులకు డీఈడీ రాసే అవకాశం లేకుండా పోయింది. ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్నందున ఏదైనా ఒకటి వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత సోమవారంతో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇక డీఈడీ సెట్కు మాత్రం దరఖాస్తుకు ఇంకా 15 రోజుల గడువు ఉంది.
రెండేళ్ల డీఈడీ చదివి, టెట్ పాసైతే ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) కొలువులకు సులభంగా ఎంపిక కావొచ్చని అధికి మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. పైగా ఎస్జీటీ పోస్టులకు పోటీ కూడా తక్కువగా ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 30 శాతమే ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపడతారు. మిగిలిన 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. అంతేకాకుండా గత డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు కొన్ని జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య పది కూడా దాటకపోవడంతో అందరి చూపు ఎస్జీటీ పోస్టులపై పడింది. దీంతో ఈ ఏడాది డీఈడీ పోస్టులకు అధిక డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాశాక డీఈడీ పరీక్ష రాసేందుకు అవకాశం లభించేలా.. ఆ పరీక్ష తేదీని మార్చాలని విన్నవిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.