
హైదరాబాద్, మే 7: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్దులకు మే 13వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,97,997 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో తప్పిన విద్యార్థులతోపాటు ఫస్టియర్లో మార్కులు పెంచుకునేందుకు పోటీ పడుతున్న విద్యార్ధులు కూడా ఉన్నారు. జనరల్, ఒకేషనల్ కలిపి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2,67,141 మంది విద్యార్ధులు, సెకండ్ ఇయర్లో 1,30,856 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. ఈ క్రమంలో విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్సైట్తోపాటు ఈ-గవర్నెన్స్ వాట్సప్ ద్వారా కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే విద్యార్ధులు తాము చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ నుంచి కూడా హాల్ టికెట్లను పొందవచ్చు.
కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం 19వ తేదీతోనే ముగుస్తాయి. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు.
మే 21తో థియరీ పరీక్షలు ముగియగానే.. ఆ మరుసటి రోజు నుంచే మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి కూడా రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఇక మే 26న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మే 28న జరిగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షతో సప్లిమెంటరీ పరీక్షలు ముగియనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.