
హైదరాబాద్, ఆగస్ట్ 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారుల ఆరోగ్యాలకు భరేసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 (సోమవారం) నుంచే రాగిజావ పథకం మళ్లీ ప్రారంభం కానుంది. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఉదయం నుంచి ఆకలి తీర్చుకోడమే కాకుండా, ఆరోగ్యానికి తోడు న్యూట్రిషన్ కూడా పొందేలా ఈ పథకాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు దాదాపు 18 లక్షల పిల్లలకు ఈ జావ అందుతుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి తోడు, వారానికి మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజులు రాగిజావ అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్. రాగి పౌడర్, బెల్లం సరఫరా చేస్తూ, బడిలో వడ్డించే ప్రతి గ్లాస్ జావకి ఖర్చు భరించేందుకు ముందుకు వస్తోంది. ప్రభుత్వ–ట్రస్ట్ భాగస్వామ్యంతో ఏటా సుమారు రూ.35 కోట్ల వ్యయం అవుతుంది. అందులో 60% ట్రస్ట్ భరిస్తే, మిగతా భాగం ప్రభుత్వ నిధుల నుంచి వస్తుంది. రాగిజావ తయారు చేసి పిల్లల చేతికి అందించే స్వయంసహాయక సంఘాలకు అదనంగా రాగిజావ వండినందుకు గాను.. ప్రతి గ్లాస్కీ రూ.25 పైసల చొప్పున చెల్లించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచే ఈ పథకం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగి జావ అందించడం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.