Telangana: నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్.. త్వరలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధంచిన నోటిఫికేషన్ వెలువడనుంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన సర్కారు.. ఖాళీల భర్తీకి అడుగులు వేస్తోంది. శాఖల వారీగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఖాళీల వివరాలను సమీక్షించేందుకు సర్వీస్ కమిషన్ పాలక మండలి త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటివరకు కమిషన్ కార్యదర్శికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 6,000కు పైగా ఖాళీలుఉన్నట్లు తెలుస్తోంది.
ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు?:
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 1,000 కి పైగా అధ్యాపక పోస్టులు
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు: 300 కి పైగా అధ్యాపక పోస్టులు
- ఇతర విద్యా సంస్థలు: దేవాదాయ, అటవీ, సర్వే సెటిల్మెంట్, పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో (DIET) 100 కి పైగా అధ్యాపక ఖాళీలు
- జూనియర్ కళాశాలలు: జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల (PET) ఖాళీలు.
- ఆర్టీసీ అండ్ పురపాలక శాఖ: తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటికే కమిషన్కు లేఖ రాశారు. అలాగే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి.
నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా ‘కొత్త వ్యూహం’
పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ ఈసారి సరికొత్త విధానాన్ని పాటించబోతోంది. ఒకే సమయంలో రెండు పరీక్షలు వచ్చి అభ్యర్థులు ఇబ్బంది పడకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రస్థాయి పరీక్షలు, యూపీఎస్సీ (UPSC), ఎస్ఎస్సీ (SSC) వంటి జాతీయ స్థాయి ఎగ్జామ్స్ తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులందరూ హాజరయ్యేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ప్రతి రెండు వారాలకొకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల అర్హత ఉన్న అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.
OTR అలర్ట్
కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా.. వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా అప్లై చేస్తున్నారు. మిగిలిన వారు కూడా వెంటనే తమ ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
