
న్యూఢిల్లీ, మార్చి 4: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 32,438 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. ఆర్ఆర్బీ గ్రూప్-డి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23 నుంచి మార్చి 1, 2025వ తేదీ వరకు కొనసాగింది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఏవైనా పొరబాట్లు చేసి ఉంటే సవరణకు ఆవకాశం కల్పిస్తూ.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటన జారీ చేసింది. మార్చి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తులో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, మరోమారు అవకాశం ఇవ్వబోమని స్పష్టం బోర్డు చేసింది.
ఆర్ఆర్బీ గ్రూప్-డి దరఖాస్తుల తప్పుల సవరణకు ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే కట్ఆఫ్ మార్కులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో 452 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు గత మేలో ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో అభ్యర్ధులకు రాత పరీక్షలు నిర్వహించారు. తాజా లిస్టులోని వారికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి, తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
ఆర్పీఎఫ్ ఎస్సై ఎంపిక జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.