AP Constable Jobs: ఏపీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మోక్షమెప్పుడో? ఇంకా వెలువడని ఈవెంట్స్‌ షెడ్యూల్‌..

|

Sep 22, 2024 | 9:54 AM

ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షల కోసం అభ్యర్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి..

AP Constable Jobs: ఏపీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మోక్షమెప్పుడో? ఇంకా వెలువడని ఈవెంట్స్‌ షెడ్యూల్‌..
Physical Fitness Tests
Follow us on

అమరావతి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షల కోసం అభ్యర్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. వీరిలో తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు.ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా ఫిజికల్‌ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈవెంట్స్‌ షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడుతుంది? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారవుతుదని అధికారులు చెప్పినా.. దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పీఎంటీ, పీఈటీ నిర్వహణ తేదీలు విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్‌ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా ఆగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని యోచిస్తుంది. ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) అనంతరం ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వేగవంతంగా నిర్వహించి.. అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేసేందుకు సమాయత్తమవుతుంది.

ప్రాథమిక రాత తర్వాత రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. అయితే ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన షెడ్యూల్‌ రాకపోవడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్‌ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.