
న్యూఢిల్లీ, మే 19: మరాఠ్వాడా జిల్లాల్లో పేపర్ లీక్ చేసినట్లు ఫిజిక్స్ లెక్చరర్ అయిన శివరాజ్పై ఆరోపణలు వచ్చాయి. ఇతడి ఫోన్లో మే 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్లోని శివనగర్లో ఉన్న కోచింగ్ సెంటర్తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. అంతేకాకుండా అతడి బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సీబీఐ అధికారులు నిందితుడి వద్ద కీలక ఆధారాల స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్లలో డిజిటల్ సాక్ష్యాలను సేకరించారు.
శివరాజ్ను అతడి నివాసంలోనే సుదీర్ఘంగా విచారించిన అధికారులు పేపర్ లీకేజీ ముఠాలో శివరాజ్ కీలకంగా ఉన్నాడని గుర్తించారు. ఇతడి కోచింగ్ సెంటర్కు ఏకంగా 9 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో లాతూర్లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే అంటే ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు శివరాజ్ అందాయి. ఈ ప్రశ్నలను శివరాజ్ చేత్తోనే నోట్స్ రాసి మెటీరియల్ రూపంలో బయటకు తీసుకువచ్చాడని అధికారులు తెలిపారు. పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణితో పాత పరిచయాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. కులకర్ణికి నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)తో సంబంధాలున్నాయి.
శివరాజ్ ఇల్లు, కోచింగ్ సెంటర్లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభ్యమైంది. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆధారాలతోపాటు నీట్ పేపర్లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న వీడియోను సీబీఐ కోర్టుకు చూపడంతో.. కోర్టు శివరాజ్కు 9 రోజుల సీబీఐ కస్టడీ ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.