
హైదరాబాద్, మార్చి 11: దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు గడువు మార్చి 8తో ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువును మార్చి 11 వరకు పొడిగిస్తూ ఎన్టీయే ప్రకటన వెలువరించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు బుధవారం రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు 11వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది. ముగింపు గడువులోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరోమారు దరఖాస్తు గడువు పొడిగింపు ఉండబోదని ఎన్టీయే తన ప్రకటనలో స్పష్టం చేసింది.
నీట్ యూజీ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులకు ఈ ఫీజు రూ.9500గా ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి కూడా ఎన్టీయే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాదికి నీట్ యూజీ పరీక్ష మే 3, 2026వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
నీట్ యూజీ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.