న్యూఢిల్లీ, జూన్ 24: నీట్ (యూజీ) పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఆదివారం (జూన్ 23) రీ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. అయితే పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్ధులు గైర్హాజరయ్యారు. మొత్తం 1563 మందికి గానూ కేవలం 813 మంది మాత్రమే హాజరవడం చర్చణీయాంశంగా మారింది. 750 మంది పరీక్షకు హాజరు కాలేదు. చంఢిఘర్లో ఇద్దరు అభ్యర్థుల పరీక్ష రాసేందుకు అర్హత సాధించగా, వీరిద్దరూ పరీక్షకు హాజరుకాకపోవటం గమనార్హం. ఛత్తీస్గఢ్లో 602 మంది పరీక్ష రాసేందుకు అర్హత సాధించగా.. వారిలో 291 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే 311 మంది గైర్హాజరయ్యారు.
ఇదే విధంగా హర్యానాలో 494 మంది అభ్యర్థులలో 287 (58 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 207 మంది డుమ్మా కొట్టారు. మేఘాలయలో 464 మందికి పరీక్ష రాసేందుకు అర్హత ఉండగా.. వీరిలో 230 మంది గైర్హాజరయ్యారు. 234 మంది అంటే 50.43 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గుజరాత్లో ఒకేఒక అభ్యర్థి పరీక్షకు అర్హత సాధించగా.. ఆ విద్యార్ధి పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఏడాది మే 5వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం ఆలస్యంగా అందించడంతో వారందరికీ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇచ్చింది. దీనిపై చెలరేగిన వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో మొత్తం 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో వీరందరికీ ఆదివారం మద్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరపగా కేవలం 52 శాతం మంది మాత్రమే హాజరయ్యారు.
మరోవైపు ఎన్నడూలేనిది ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో ఏకంగా 67 మందికి టాప్ ర్యాంకులు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో పాటు వివిధ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను పదవి నుంచి తొలగించి, అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా NTA పనితీరును సమీక్షించడానికి ఏడుగురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. అక్రమాలకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇప్పటికే పేపర్ లీకేజీలకు సంబంధించి పలువురు విద్యార్ధులు పరీక్షకు ముందు రోజు రాత్రి తమకు ఆన్సర్లతో కూడిన ప్రశ్నాపత్రం అందినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ నేపథ్యంలో పరీక్ష రద్దు చేసి, 24 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా? లేదంటే కౌన్సెలింగ్ యథావిథిగా కొనసాగిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.