
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7, 2025వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్ పీజీ పరీక్షను జూన్ 15వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో మే 7, 2025వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.3500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500 చెల్లించవల్సి ఉంటుంది.
ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నాపత్రంలోని అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. ఈ పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.
నీట్ పీజీ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.