
IT Sector: ఏఐ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్నా.. భారత్లో మాత్రం ఐటీ నియామకాలు ఊపందుకున్నాయి. దాదాపు మూడేళ్లుగా కొత్త నియామకాల్లో కనిపించిన మందగమనం క్రమంగా తొలగిపోతోంది. టెక్నాలజీ దిగ్గజ సంస్థలు ఫ్రెషర్లతో పాటు అనుభవజ్ఞులను కూడా పెద్ద సంఖ్యలో నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో 1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనుభవం, నైపుణ్యం, సంస్థను బట్టి కొన్ని ప్రత్యేక పోస్టులకు ఏడాదికి రూ.50 లక్షల వరకు వేతన ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఏఐ, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ విభాగాల్లో వార్షిక వేతనాలు సుమారు రూ.12 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండే అవకాశాలున్నాయి
ఇప్పటివరకు అనుభవజ్ఞులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఐటీ సంస్థలు ఇప్పుడు ఫ్రెషర్ల నియామకాలపై కూడా దృష్టి పెడుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, క్యాప్జెమినీ, యాక్సెంచర్, డెలాయిట్, జెన్ప్యాక్ట్ తదితర సంస్థల్లో కొత్త ఉద్యోగాల అవకాశాలు పెరుగుతున్నాయి. బీఈ, బీటెక్, ఎంసీఏతో పాటు బీసీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి
ఫ్రెషర్లకు సంస్థను బట్టి సుమారు రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది. 2024లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అభ్యర్థులను కూడా కొన్ని సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డెవ్ఆప్స్, సైట్ రిలయబిలిటీ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లోనూ నియామకాలు వేగం పుంజుకున్నాయి. అమెజాన్, ఐబీఎం, ఒరాకిల్, సిస్కో, డెలాయిట్ వంటి సంస్థలు క్లౌడ్ ఆర్కిటెక్ట్, డెవ్ఆప్స్ ఇంజినీర్, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. వీటిలో అనుభవాన్ని బట్టి సుమారు రూ.14 లక్షల నుంచి రూ.38 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు ఉండొచ్చు.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో ఫుల్స్టాక్, బ్యాకెండ్, జావా, గో, నోడ్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ నిపుణులకు డిమాండ్ కొనసాగుతోంది. ఎస్ఏపీ, సేల్స్ఫోర్స్, అడోబ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఈ విభాగాల్లో నియామకాలు చేపడుతున్నాయి. అర్హత, అనుభవాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు వార్షిక వేతనాలు అందే అవకాశాలున్నాయి.
ఐటీకి మాత్రమే ఈ నియామకాలు పరిమితం కాలేదు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లోనూ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్మన్ శాక్స్, హెచ్ఎస్బీసీ, మోర్గాన్ స్టాన్లీ, అమెరికన్ ఎక్స్ప్రెస్, మాస్టర్కార్డ్ వంటి సంస్థలు సైబర్ సెక్యూరిటీ, రిస్క్ అనలిటిక్స్, ఫైనాన్స్ సాఫ్ట్వేర్, డిజిటల్ బ్యాంకింగ్, కాంప్లయన్స్ అనలిటిక్స్ వంటి విభాగాల్లో నిపుణులను తీసుకుంటున్నాయి.
హెల్త్కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. క్లినికల్ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, హెల్త్కేర్ డేటా ఇంజినీరింగ్, డిజిటల్ హెల్త్ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో బోయింగ్, మెర్సిడెస్ బెంజ్, బాష్, సీమెన్స్, క్యాటర్పిల్లర్ వంటి సంస్థలు ఏవియానిక్స్, ఫ్లైట్ సిస్టమ్స్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, డిజిటల్ ట్విన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి విభాగాల్లో ఇంజినీరింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి.
భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) వేగంగా విస్తరిస్తుండటం కూడా ఉద్యోగాల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతోంది. కొత్త టెక్నాలజీ ప్రాజెక్టులు, క్లౌడ్ సేవలు, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి కార్యకలాపాలను భారత్కు తీసుకురావడంతో నిపుణుల అవసరం పెరుగుతోంది.
మొత్తంగా చూస్తే భారత ఐటీ, టెక్నాలజీ ఉద్యోగ మార్కెట్లో మళ్లీ నియామకాల వేడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే వారికి ఈ నియామకాలు మంచి అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్న్యూస్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి