
హైదరాబాద్, ఏప్రిల్ 20: జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలు ఏప్రిల్ 19న విడుదలైన సంగతి తెలిసిందే. వీటితో పాటు జేఈఈ మెయిన్ రెండు విడతల్లో అభ్యర్ధుల ర్యాంకులను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడులద చేసింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్లో దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది 100 పర్సంటైల్ స్కోర్ చేశారు. అందులో నలుగురు విద్యార్ధులు తెలుగు రాష్ట్రాలకు చెందని వారు కావడం విశేషం. వీరిలో ముగ్గురు తెలంగాణ, ఒకరు ఏపీకి చెందిన వారు. వంగల అజయ్రెడ్డి, బనిబ్రత మాజీ అనే ఇద్దరు అభ్యర్ధులకు 300కి 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నారు. హర్ష ఎ.గుప్తా 100 పర్సంటైల్ పొందినా వంద శాతం మార్కులు రాకపోవడంతో 15వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఏపీ నుంచి 100 పర్సంటైల్ సాధించిన సాయిమనోజ్ఞ గుత్తికొండ 18వ ర్యాంకు సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్లో 100లోపు ర్యాంకుల్లో ఏకంగా 35 వరకు ఉంటారని అంచనా. ఇక వెయ్యిలోపు కనీసం 200 మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా రెండు విడతలకు సంబంధించి మొత్తం 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం అర్ధరాత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్కు రెండు విడతల్లో ఉమ్మడిగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 14.75 లక్షల మంది పరీక్షలు రాశారు. చివరకు అడ్వాన్స్డ్ పరీక్షకు 2.50 లక్షల మంది కనీస మార్కులు పొందారు. వీరంతా దేశంలోని ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్టీఐ)ల్లో సీట్లు పొందేందుకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసి అర్హత పొందాల్సి ఉంటుంది. జే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.