JEE Advanced 2026 Registration: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ఎవరు అర్హులంటే?
ఇటీవల జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆ తదుపరి దశ అయిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ (IITs)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 23 నుంచి అప్లికేషన్ విండో ప్రారంభమైంది. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకుల్లో అర్హత సాధించిన సుమారు 2.50 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ 2026కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 17న నిర్వహిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ పరీక్షమొత్తం రెండు పేపర్లకు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 1, 2026 ఉదయం 10 గంటలకు ఎన్టీయే విడుదల చేస్తుంది. అనంతరం జోసా కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి మొదలవుతుంది.
అలాగే జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ 2026) నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్ 7న ఏఏటీ 2026 పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి.
కాగా జేఈఈ మెయిన్లో వచ్చిన ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఐఐటీల్లో చేరాలనుకునే వారు మాత్రం తప్పనిసరిగా అడ్వాన్స్డ్ రాసి అందులో అర్హత సాధించాల్సిందే. ఈ ఏడాదికి పరీక్షను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తుంది. దరఖాస్తు ఎలా చేయాలో వివరిస్తూ ఐఐటీ రూర్కీ వీడియో గైడెన్స్ ద్వారా విద్యార్ధులకు అవగాహన కలిగించింది. వీటి సహాయంతో విద్యార్థులు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




