JEE Advanced Attempt Limit: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అటెమ్ట్‌ లిమిట్‌ పెరిగిందోచ్‌.. ఇకపై మూడేళ్లు రాసే ఛాన్స్‌!

ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు గతంలో కేవలం రెండేళ్ల వరకు మాత్రమే పరిమితి ఉండేది. దానిని తాజాగా పెంచుతూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఇకపై వరుసగా మూడేళ్ల పాటు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు

JEE Advanced Attempt Limit: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అటెమ్ట్‌ లిమిట్‌ పెరిగిందోచ్‌.. ఇకపై మూడేళ్లు రాసే ఛాన్స్‌!
JEE Advanced 2024 Attempt Limit

Updated on: Nov 07, 2024 | 7:28 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 7: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ పరీక్ష యేటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన 1.5 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తారు. అయితే ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఇప్పటివరకు వరుసగా 2 సంవత్సరాలు మాత్రమే రాసేందుకు అవకాశం ఉండేది. ఇకపై మూడేళ్లు వరుసగా రాసుకోవచ్చని తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ వెసులుబాటు 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ పాసైన విద్యార్ధులకు కూడా వర్తిస్తుంది. దీంతో వారంతా ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం లభించినట్లైంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష నిర్వహణ చేపట్టిన ఐఐటీ కాన్పుర్‌ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.

అయితే 2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష రాసేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు మాత్రం అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు 1995 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా ఈ పరీక్ష రాయొచ్చన్నమాట. సిలబస్‌లో మాత్రం ఎటువంటి మార్పు ఉండని, గత జేఈఈ సిలబస్‌ ప్రకారంగానే సిద్ధమవ్వాలని ఐఐటీ కాన్పుర్‌ వెల్లడించింది. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష తేదీని ఐఐటీ కాన్పుర్‌ ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా ఈ పరీక్ష ప్రతి యేట మే 3వ లేదా 4వ వారంలో నిర్వహిస్తుంటారు. ఆ ప్రకారం చూస్తే ఈసారి మే 18 నుంచి 25 మధ్య తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక మరోవైపు ఐఐటీ కాన్పూర్‌ విద్యార్ధులకు మరో బంపరాఫర్‌ ఇచ్చింది. అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా ఐఐటీ కాన్పుర్‌లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు నేరుగా బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) సీట్లు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. గణితం, ఇన్‌ఫర్మేటిక్స్‌ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి సీఎస్‌ఈలో 6 సీట్ల వరకు కేటాయిస్తామని పేర్కొంది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ సైన్సెస్, మేధమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, బయలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ సీట్లు కేటాయిస్తామని తెలిపింది. ఈ సీట్లకు ప్రవేశాలు కల్పించడానికి మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానిస్తారని, జోసా కౌన్సెలింగ్‌ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తిచేయనున్నట్లు తెలిపింది. అయితే వీరికి అదనంగా సీట్లు కేటాయిస్తారా.. లేదంటే ఇప్పటికే ఉన్న సీట్ల నుంచి కేటాయిస్తారా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us