అమరావతి, ఆగస్టు 8: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 91,463 మంది పరీక్ష రాశారు. అయితే ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మెయిన్స్కు అర్హత సాధించారు. మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఆ తర్వాత కేవలం 24 రోజుల్లోనే కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
అయితే తాజాగా ప్రిలిమ్స్ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్కు అనుమతి ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డీవైఈఓ, గ్రూప్-2 మెయిన్ పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలోనే ఎంపిక చేశారని, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని గుర్తుచేస్తున్నారు. దీనిపై గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదనీ, కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వేచి చూడాల్సిందే.
మరోవైపు వచ్చే నెలలోనే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఒకవేళ సానుకూలం స్పందించి మెయిన్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తే.. పరీక్ష పన్నద్ధతకు సమయం కావాలంటూ అభ్యర్ధులు కోరుతారు. దీంతో మెయిన్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగే ఛాన్స్ లేనట్లే అవుతుంది.