ఏపీ TET 2026కు భారీ స్పందన.. 56 వేలకుపైగా ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2026కు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. జులై 2 నాటికి 1.58 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 56 వేల మందికి పైగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉండటం విశేషం. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం 2028 ఆగస్టు 31 నాటికి అన్ని ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సి ఉండటంతో, ముఖ్యంగా 2010కు ముందు నియమితులైన టీచర్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు..

ఏపీ TET 2026కు భారీ స్పందన.. 56 వేలకుపైగా ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
Huge Response to AP TET

Updated on: Jul 03, 2026 | 3:00 PM

అమరావతి, జులై 3: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా సర్వీసులో ఉన్న టీచర్ల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం విశేషం. మొత్తం దరఖాస్తుల్లో 56,387 మంది ఈసారి టెట్‌కు అప్లై చేసుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి అధిక మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు అంటే జులై 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,58,264 మంది దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. జులై 5వ తేదీ ముగింపు గడువులోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తుంది. సర్వీసులో ఉన్న టీచర్లకు తప్పనిసరిగా టెట్‌ అర్హత ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టీచర్ల గుండెల్లో గుబులు నెలకొంది.

దీంతో 2010కి ముందు డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లందరూ ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారో దానికి సంబంధించిన టెట్‌ పేపర్‌ రాయాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ రాయాల్సిన టీచర్లు సుమారు 80 వేల వరకు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 56 వేలకు పైగా టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నిర్వహించిన టెట్‌ పరీక్షకు సర్వీసులో ఉన్న టీచర్లు మొత్తం 31,886 మంది హాజరవగా.. ఇందులో 15,239 మంది అర్హత సాధించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2028 ఆగస్టు 31 నాటికి టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోని వారు జులై 5, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఆగస్ట్ 5 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షల అనంతరం ఆగస్ట్ 24న ఆన్సర్ కీలు విడుదల చేస్తారు. ఫలితాలు సెప్టెంబర్ 15న వెల్లడిస్తామని ఇప్పటికే విద్యాశాఖ పేర్కొంది.

Follow Us