
అమరావతి, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) జూన్ 2026 సెషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఆసక్తి కలిగిన బీఎడ్, డీఎడ్ నిరుద్యోగులతోపాటు ప్రస్తుతం బడుల్లో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న ఇన్-సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాసేందుకు అవకాశం ఉంటుంది. వీరంతా జూలై 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే నిరుద్యోగ యువత టెట్ అప్లికేషన్ ఫీజు చూసి గుడ్లు తేలేస్తున్నారు.
Also read: మొసళ్లు, సింహం, పాము.. ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న
2024లో టెట్ ఫీజు ఒక్కో పేపర్కు రూ.750గా ఉంది. రెండు పేపర్లు రాస్తే రూ.1500 చెల్లించేవారు. ఇక 2023లో అయితే విద్యాశాఖ ఒక్కో పేపర్కు రూ.500లుగా ఫీజు నిర్ణయించింది. కానీ గత ఏడాది నిర్వహించిన టెట్ నుంచి దరఖాస్తు ఫీజును రెట్టింపు చేశారు. ఏకంగా ఒక్కో పేపర్కు రూ.1000 వసూలు చేస్తున్నారు. ప్రతి పేపర్కు రూ.1,000 ఫీజు నిర్ణయించడంతో 2 పేపర్లు, 4 పేపర్లకు దరఖాస్తు చేసుకునే వారు రూ.2000, రూ.4000 చొప్పన చెల్లించవల్సి రావడంతో ఆర్థికంగా భారంగా మారింది. అసలే నిరుద్యోగులు .. అపై అప్లికేషన్ల ఫీజు ఇలా వేలల్లో ఉండటంతో నిరుద్యోగ యువత గగ్గోలు పెడుతున్నారు.
టెట్ అర్హత సర్టిఫికేట్కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. భవిష్యత్ టీచర్ రిక్రూట్మెంట్లలో AP TET స్కోర్కు 20% వెయిటేజ్ ఉంటుంది. మిగిలిన 80% వెయిటేజ్ TRT రాత పరీక్షకు ఉంటుంది. ఇందులో OC/ EWS అభ్యర్ధులు 60 శాతం (90 మార్కులు), బీసీ అభ్యర్ధులు 50 శాతం (75 మార్కులు), SC, ST, PwBD, Ex-Servicemen అభ్యర్ధులు 40 శాతం (60 మార్కులు) చొప్పున సాధించవల్సి ఉంటుంది. స్కోర్ మెరుగుపరుచుకోవడానికి అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాయవచ్చు. అందువల్ల టెట్ స్కోర్ పెంచుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతిసారీ భారీగా యువత దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో టెట్ దరఖాస్తు ఫీజు ఇలా ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించవల్సి రావడంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి టెట్ ఫీజును తగ్గించాలని టెట్ అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.