
అమరావతి, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APPGECET) 2026 ఆన్లైన్ పరీక్షలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ఇప్పటికే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి 30 తేదీల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బి. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఈ సెట్ పరీక్షకు మొత్తం 12,102 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామని వివరించారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటాయని ఆయన చెప్పారు.
ఉదయం సెషన్కు ఉదయం 7.30 గంటల నుండి, మధ్యాహ్నం సెషన్కు మధ్యాహ్నం 12.30 గంటల నుండి పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశానికి అనుమతి ఉంటుందని తెలిపారు. నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా హాలులోకి హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, బాల్పాయింట్ పెన్ను మాత్రమే అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు ప్రవేశం లేదు. మొత్తం 18 నగరాల్లో 26 పరీక్షా కేంద్రాల్లో APPGECET—2026 కోసం ఏర్పాటు చేశామని అన్నారు. అభ్యర్థులు తమతమ పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, జారీ చేసిన అన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్ తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. తాజా ప్రకటన మేరకు మే 8 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలోని 23 పరీక్ష కేంద్రాల్లో ఎస్వీ యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి పద్మావతి తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.