
అమరావతి, ఆగస్ట్ 3: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకుని కొత్త మోసాలు జరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ నియామక ప్రకటనలు, అపాయింట్మెంట్ లేఖలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదు చేసిన అధికారులు… ఉద్యోగార్థులు అధికారిక వెబ్సైట్లను మాత్రమే నమ్మాలని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ లోగోలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ముద్రలు, నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో నకిలీ నియామక ప్రకటనలు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంపై సీఐడీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేర్లతో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల కోసం ఎలాంటి రుసుములు చెల్లించవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలు కేవలం ఏపీఎంఎస్ఆర్బీ లేదా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారానే జరుగుతాయని అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, దరఖాస్తులు, ఇంటర్వ్యూలు, ఫలితాల వివరాలను అధికారిక వెబ్సైట్లలో మాత్రమే పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద సందేశాలు లేదా నకిలీ నియామక లేఖలు అందితే వెంటనే పోలీసులకు లేదా ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.