
అమరావతి, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ల పనిభారాన్ని తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో తాత్కాలికంగా మార్పులు చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణతో పాటు ఇతర ఎన్నికల సంబంధిత విధుల్లో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మరోవైపు బీఎల్ఓ బాధ్యతలను సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: ONE = 314, TWO = 325, THREE = 538 అయితే SIX = ఎంత..? మ్యాథ్స్ కాదు లాజిక్ కావాలి..
తాజా ఆదేశాల ప్రకారం.. బీఎల్ఓ విధుల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్న కేంద్రాలు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ మార్పు జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే టైమింగ్స్ జూలై 28 వరకు కొనసాగనున్నాయి. నెల రోజుల పాటు ఈ ప్రత్యేక సమయాలు అమల్లో ఉండనున్నాయి. అయితే ఈ మార్పు కేవలం BLO విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ల కేంద్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా పాత సమయాల్లోనే పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమయాల్లో మార్పులు చేసినప్పటికీ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులకు అవసరమైన సేవలు నిరంతరంగా అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది.
అలాగే జూన్, జూలై నెలల్లో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రాల కొత్త పని వేళల గురించి లబ్ధిదారులకు ముందుగానే సమాచారం అందించి అవగాహన కల్పించాలని అంగన్వాడీ సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు కొంత మేర పనిభారం తగ్గి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరణించిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి.. కొత్త ఓటర్లను చేర్చడమే లక్ష్యంగా ఈ సర్వేను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి వాటిని చూపించాల్సి ఉంటుంది.