
అమరావతి, ఫిబ్రవరి 19: ఉగాది సందర్భంగా కూటమి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఆయా జాల్లాల్లో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. మొత్తం 3,600 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చింది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూళ్లు, సంక్షేమ పాఠశాలల నుంచి ఖాళీల వివరాలు సేకరించింది. వీటిల్లో మరో 1200 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో 1700, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 700.. కలిపి మొత్తం 3,600 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. కాగా గతేడాది ఏప్రిల్లో దాదాపు16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. ఆయా రిజర్వేషన్లలో అభ్యర్థులు లేనందున కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. వీటితోపాటు ఇప్పటి వరకు ఏర్పడిన ఖాళీలకు కలిపి ఈ నోటిఫికేషన్ రానుంది.
ఉగాది పండగ వచ్చే నెల అంటే మార్చిలోనే రానుంది. అంటే మరో నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుందన్నమాట. ఈ డీఎస్సీ సిలబస్లో ఎటువంటి మార్పులు లేవని, గత ఏడాది డీఎస్సీ సిలబస్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రత్యేక డీఎస్సీకి మాత్రం కొత్త సిలబస్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. అయితే అన్ని టీచర్ పోస్టులకూ ఇంగ్లిష్ భాష ప్రావీణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని తొలుత సర్కార్ భావించింది. అంత సమయం లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రత్యేక పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 2,600 మంది వరకు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిలో అన్ని అర్హతలూ ఉన్న సుమారు 800 మంది ఉన్నారు. వీరికి పదేళ్ల సర్వీసు, టెట్లాంటి అర్హతలు ఉంటే మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. అయితే పర్మినెంట్ ఉద్యోగం పొందాలంటే మాత్రం వీరు కూడా డీఎస్సీ రాయాల్సి ఉంటుంది. వీరికి స్పెషల్ డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.