
అమరావతి, మార్చి 4: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక ఇప్పటికే రంజన్ పండగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమైనాయి. మరో వారం రోజుల్లో అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు పెట్టే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రంగా నానాటికీ పెరుగుతుంది. మార్చి ప్రారంభం ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రాణాళికలు కూడా సిద్ధం చేసింది.
అయితే ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మార్చి 15 నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు మునుపెన్నడు లేనివిధంగా ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఒంటిపూట బడులు వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి.
కాగా గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే.. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. దీంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.