
అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఈఏపీసెట్) ఆన్లైన్ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి ఏపీ-ఈఏపీసెట్ 2025కు సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మే 12 నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్, కన్వీనర్ వీవీ సుబ్బారావు ఓ ప్రటనలో తెలిపారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం 3,61,299 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
ఈ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ 95523 00009 నుంచి కూడా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి విద్యార్ధులు పరీక్షా కేంద్రం సులువుగా తెలుసుకునేలా హాల్టికెట్లో రూట్మ్యాప్ కూడా ఇచ్చినట్లు కన్వీనర్ వీవీ సుబ్బారావు చెప్పారు. ఇతర సందేహాలకు 0884-2359599, 2342499 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 21 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్తోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని విద్యార్ధులకు సూచించారు. ఇక పరీక్షల అనంతరం అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21వ తేదీన విడుదల చేస్తారు. ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ఆన్సర్ కీని మే 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఫైనల్ ఆన్సర్ కీని జూన్ 5వ తేదీన ప్రకటించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.