రూ.11,000 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి జెప్టో! క్విక్ కామర్స్ రంగంలో కొత్త దశ

బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ Zepto త్వరలో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దాదాపు రూ.11,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ, జూలై చివరినాటికి లిస్టింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

రూ.11,000 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి జెప్టో! క్విక్ కామర్స్ రంగంలో కొత్త దశ
Zepto

Updated on: May 21, 2026 | 9:32 PM

బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో త్వరలో భారత స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.11,000 కోట్ల నిధులను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ విజయవంతమైతే, ఇప్పటికే మార్కెట్లో లిస్టయిన జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో కూడా చేరనుంది. సమాచారం ప్రకారం కంపెనీ ఇప్పటికే సెబీ నుంచి పబ్లిక్ ఆఫర్‌కు అవసరమైన అనుమతులు పొందింది.

తాజాగా అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ (UDRHP)ను కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జూలై 31లోపు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. క్విక్ కామర్స్ రంగంలో జెప్టో వ్యూహం ఇతర కంపెనీలతో పోలిస్తే భిన్నంగా ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రస్తుతం జెప్టో దేశవ్యాప్తంగా 61 నగరాల్లో 1,255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో నగరంలో సగటున 21 స్టోర్ల సాంద్రత ఉండటం కంపెనీ ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇదే సమయంలో పోటీ సంస్థలు సగటున తొమ్మిది స్టోర్లకే పరిమితమవుతున్నాయి.

ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా స్థాపించిన ఈ సంస్థ మొదట ‘కిరాణాకార్ట్’ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రారంభంలో 45 నిమిషాల్లో సరుకుల డెలివరీ లక్ష్యంగా పనిచేసిన కంపెనీ, తర్వాత సొంత డార్క్ స్టోర్ల మోడల్‌ను అభివృద్ధి చేసి 10 నిమిషాల్లో డెలివరీ సేవలను అందిస్తోంది. వేగవంతమైన సేవలే ప్రధాన బలంగా తీసుకుని కంపెనీ ‘జెప్టో’గా రీబ్రాండ్ అయింది. భారతదేశంలో ఆన్‌లైన్ గ్రోసరీ, క్విక్ డెలివరీ సేవల డిమాండ్ వేగంగా పెరుగుతున్న సమయంలో జెప్టో ఐపీఓ మార్కెట్లో మంచి ఆసక్తిని రేకెత్తించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us