
ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి బడ్జెట్లో ‘కన్యా సుమంగళ యోజన’ అనే పధకానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది యోగీ సర్కార్. ఇందుకోసం ఏకంగా రూ.1050 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ప్రస్తుతం ఈ స్కీం సామాన్యులకు మరింత చేరువైంది. ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకం కింద మీ కుమార్తె పుట్టినప్పటి నుంచి ఆమె వివాహం వరకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుంది.
ఈ పథకంలో భాగంగా యోగీ సర్కార్.. స్కీంలో భాగమైన లబ్దిదారులకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లలను స్వావలంబనగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత బడ్జెట్ కంటే.. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఈ స్కీమ్లో కేటాయింపులు భారీగా పెంచడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ‘కన్యా సుమంగళ యోజన’ పధకం కింద యూపీలోని బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15000 అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 6 సమాన వాయిదాలలో లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వేస్తారు. ఇక ఈ పధకం ప్రయోజనం పొందటానికి లబ్దిదారుడి కుటుంబ వార్షికాదాయం 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అలాగే ఈ స్కీం ద్వారా బాలికలకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని అధికారులు తెలిపారు. కాగా, ఈ పధకాన్ని యూపీ సర్కార్ ఏప్రిల్ 2019లో ప్రారంభించగా.. ఈసారి బడ్జెట్లో స్కీంకు భారీగా నిధులు కేటాయించారు సీఎం యోగీ ఆదిత్యనాద్.