AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: కేజీఎఫ్‌ను మించి.. భారత్‌లో అత్యధిక బంగారం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..?

భారతీయులకు బంగారం అంటే ఒక ఎమోషన్, లక్ష్మీదేవి ప్రతిరూపం. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, తులం బంగారం కొనాలని ప్రతి సామాన్యుడు కలలు కంటూనే ఉంటాడు. అయితే మన దేశానికి ఇంతటి బంగారాన్ని అందిస్తున్న రాష్ట్రం ఏదో మీకు తెలుసా?ఉత్పత్తిలో కర్ణాటక రారాజుగా నిలిచినా, భూగర్భంలో ఉన్న అసలైన బంగారు నిధి మాత్రం మరో రాష్ట్రంలో దాగి ఉంది. ఆ రాష్ట్రం ఏదంటే?

Gold: కేజీఎఫ్‌ను మించి.. భారత్‌లో అత్యధిక బంగారం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..?
Gold Reserves In India
Krishna S
|

Updated on: Feb 09, 2026 | 8:34 PM

Share

మన దేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక సెంటిమెంట్, ఒక సురక్షితమైన పెట్టుబడి. పెళ్లిళ్లైనా, పండుగలైనా బంగారం ఉండాల్సిందే. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, కొనుగోలుదారులు మాత్రం తగ్గడం లేదు. అయితే అసలు మన దేశంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది..? ఏ రాష్ట్రం దగ్గర అత్యధిక బంగారు నిల్వలు ఉన్నాయి.? అన్న విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా? అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

99 శాతం బంగారం అక్కడి నుంచే

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతదేశంలో బంగారు ఉత్పత్తిలో కర్ణాటక తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. రాయచూర్ జిల్లాలోని హుటి బంగారు గనులు దేశంలోనే అత్యంత పురాతనమైనవి. కేజీఎఫ్ సినిమా పుణ్యమా అని అందరికీ తెలిసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కూడా కర్ణాటకలోనే ఉన్నాయి. దేశంలో తవ్వే మొత్తం బంగారంలో దాదాపు 99 శాతం ఒక్క కర్ణాటక నుండే రావడం గమనార్హం.

కానీ.. నిల్వల్లో బీహార్ నంబర్ వన్

మీకు తెలుసా? అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసేది కర్ణాటక అయినప్పటికీ భూగర్భంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న రాష్ట్రం మాత్రం కర్ణాటక కాదు అది బీహార్. బీహార్‌లోని జముయి జిల్లాలో సుమారు 222.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దేశం మొత్తం మీద ఉన్న బంగారు నిల్వల్లో ఒక్క బీహార్‌లోనే 44 శాతం నిల్వలు ఉండటం విశేషం. ఇది కొన్ని చిన్న దేశాల మొత్తం బంగారం కంటే కూడా ఎక్కువే. ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోతైన అధ్యయనాలు చేస్తున్నాయి.

గనుల నుంచి మీ చేతి వరకు

బంగారం సాధారణంగా భూగర్భ గనుల్లో రాయి లేదా ఖనిజం రూపంలో ఉంటుంది. దీనిని తవ్వి తీసిన తర్వాత శుద్ధి చేసి, స్వచ్ఛమైన లోహంగా మారుస్తారు. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వినియోగదారు కావడంతో మన అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ధరలు ఎంత పెరిగినా బంగారంపై భారతీయులకు ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదు. భవిష్యత్తులో బీహార్‌లోని నిల్వలను పూర్తిగా వెలికితీస్తే, భారత్ బంగారు ఉత్పత్తిలో మళ్లీ ప్రపంచ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.