సంక్షోభ సమయంలో భారత్కు షాకిచ్చిన సౌదీ..! ఏప్రిల్ నుంచి..
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంతరాయాల వల్ల సౌదీ అరమ్కో చైనా, ఇండియాకు చమురు సరఫరాలను తగ్గించింది. ఈ సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు దారితీసి, దిగుమతి చేసుకునే దేశాలపై భారం మోపుతోంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియాకు చెందిన అరమ్కో, తన ప్రధాన ఆసియా కొనుగోలుదారులైన చైనా, ఇండియాలకు వచ్చే నెలలో చమురు సరఫరాలను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో చైనాకు సుమారు 4 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును పంపాలని సౌదీ అరేబియా భావిస్తున్నప్పటికీ, ఇది సాధారణ స్థాయిల కంటే తక్కువ. ఇదే సమయంలో భారతదేశానికి సరఫరాలు సుమారు 23 మిలియన్ బ్యారెళ్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇటీవలి నెలల్లో 25–28 మిలియన్ బ్యారెళ్ల మధ్య ఉన్న సరఫరాతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదలగా భావిస్తున్నారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఏర్పడిన అంతరాయం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ ఈ కీలక జలమార్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం దాదాపు మూసివేయబడటంతో సరఫరా గొలుసు దెబ్బతింది. ఇరాన్ ఈ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభించడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగి, దిగుమతులపై ఆధారపడే దేశాలకు అదనపు భారం పడుతోంది.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. పర్షియన్ గల్ఫ్ మార్గం బదులుగా, అరేబియా ద్వీపకల్పం మీదుగా పైప్లైన్ ద్వారా ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్ట్కు చమురును తరలిస్తోంది. అయితే ఈ మార్గం ద్వారా రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యం మాత్రమే ఉండటం వల్ల, గతంలో ఉన్న 7.2 మిలియన్ బ్యారెళ్ల సరఫరా స్థాయిని పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కావడం లేదు. ఇదే ప్రభావం యూరప్కూ విస్తరించింది. కొన్ని రిఫైనరీలకు సరఫరాలు తగ్గిపోగా, కొన్ని చోట్ల పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
