
రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రైళ్లు తిరుగుతుండగా.. తరచూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. దేశంలో రైల్వే కనెక్టివిటీని పెంచడం, రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రైళ్లు ప్రత్యేకతను చాటుకున్నాయి. 2019 జనవరిలో వీటిని ప్రారంభించగా.. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ సర్వీసులు అందిస్తున్నాయి. మేకిన్ ఇండియలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన వందే భారత్ రైళ్లు.. సురక్షితమైన, నమ్మకమైన, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్గిస్తున్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించారు. త్వరలో ముంబై-బెంగళూరు మధ్య మరో స్లీపర్ రైలును ప్రారంభించనున్న క్రమంలో.. వీటిల్లోని నిబంధనల గురించి తెలుసుకుందాం.
వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఎలాంటి రాయితీలు ఉండవు. వృద్దులు, దివ్యాంగులకు సాధారణ రైళ్లల్లో ఉండే రాయితీలు వీటిల్లో వర్తించవు. ఎవరైనా పూర్తి ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఇక వీటిల్లో ప్రత్యేక లగేజీ స్థలం ఉంటుంది. చిన్న బ్యాగులు పెట్టుకునేందుకు ఓవర్ హెడ్ ర్యాక్లు అందుబాటులో ఉంటాయి. ఇక బెర్త్ల కింద స్టోరేజ్తో పాటు పెద్ద సూట్ కేసుల కోసం కోచ్ ఎంట్రీల వద్ద కూడా ప్రత్యేక స్థలం ఉంటుంది.
వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కిలోమీటర్కు రూ.2.40 నుంచి రూ.3.80 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. వీటిల్లో మొత్తం 16 కోచ్లు ఉంటుండగా.. 823 మంది ప్రయాణికుల వెళ్లే సామర్థ్యం ఉంటుంది. డిసెంబర్ 2025 వరకు దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక స్లీపర్ రైళ్ల విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరిలో హౌరా-గువహతి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా.. రెండో రైలును త్వరలో ముంబై-బెంగళూరు మధ్య అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైలు ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో ఏపీలోని ప్రయాణికులకు కూడా త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ రైలు ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది.. ? టైమ్ టేబుల్ ఏంటి అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే వీటిని ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఏడాదిలో మరిన్ని స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి మరో 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.