
సమయానికి ఆఫీసులకు వెళ్లాలన్నా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలన్నా చాలా మందికి తొలుత గుర్తొచ్చేది ఉబర్, ఓలా వంటి సర్వీసులు. ముఖ్యంగా వేసవిలో ఎంచక్కా కార్లో ఏసీ వేసుకొని ప్రయాణించడానికి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఉబర్ నుంచి కార్లు, బైక్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తొలిసారి ఉబర్ బస్సు సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది.
తక్కువ ఖర్చుతో మంచి ప్రయాణ అనుభూతిని పొందేందుకు ఉబర్ ఈ సేవలను ప్రారంభిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా భారత్లో కూడా ఈ సేవలను ప్రారంభించేందుకు ఉబర్ సన్నాహాలు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రీమియం స్కీమ్ కింద ఇకపై బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ పొందింది ఉబర్. దేశంలో ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖగా ఢిల్లీ, అలాగే దీనిని అందుకున్న తొలి అగ్రిగేటర్గా ఉబర్ నిలిచింది. ఏడాది పాటు దిల్లీ-ఎన్సీఆర్తో పాటు, కోల్కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్పాండే చెప్పారు. ఢిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించామని, ఇప్పుడు అధికారికంగా తమ సేవలను ఢిల్లీలో ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక ఈ బస్సు సర్వీసును ప్రయాణికులు వారం రోజుల ముందు నుంచే బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. పూర్తి టెక్నాలజీ సహాయంతో ఈ బస్సు సర్వీసులను నడిపిస్తారు. బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్ లొకేషన్, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్ యాప్లో తెలుసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..