
భారత్లో టెస్లా ప్రవేశంపై ఏళ్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. అసెంబుల్డ్ EVలపై భారత్ విధిస్తున్న భారీ దిగుమతి సుంకాల కారణంగా అప్పట్లో టెస్లా వెనకడుగు వేసింది. సుంకాలు తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని అప్పట్లో మస్క్ భారత ప్రభుత్వంతో లాబీయింగ్ కూడా చేశారు. దేశీయ తయారీసంస్థలకు విఘాతం కలుగుతుందనే భయంతో విదేశీ ఆటోమొబైల్ సంస్థలకు రాయితీల విషయంలో భారత్ సర్కారు వెనకడుగు వేస్తూ వచ్చింది. ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఒక సంచలనం టెస్లా. కంపెనీకి ఉన్నవి ఏడు మోడల్సే అయినప్పటికీ EV మార్కెట్లో టెస్లాది తిరుగులేని స్థానం. ఎలక్ట్రిక్ మోటర్లను కనిపెట్టిన నికోలా టెస్లా పేరు మీద ఈ కంపెనీ ఏర్పాటైంది. వాస్తవానికి ఈ కంపెనీని ఎలాన్ మస్క్ ఏర్పాటు చేయలేదు. ఈ కంపెనీకి భారీగా ఫండింగ్ ఇవ్వడంతో అది ఆయన సొంతమైంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎలక్ట్రిక్ వాహన దిగుమతి విధానంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దేశీయ తయారీదారులను కాపాడుతూనే అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమిది. గతేడాది విడుదల చేసిన EV విధానం ప్రకారం 4,150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హామీ ఇచ్చే కంపెనీలకు 15 శాతం సుంకంతో ఏటా 8 వేల వాహనాలు దిగుమతి చేసుకునే వెసులుబాటు అంతర్జాతీయ ఆటో కంపెనీలకు లభించనుంది. బహుశా ఈ తాయిలాలు చూసే భారత్లో అడుగుపెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపి ఉంటుంది. అమెరికా పర్యటన సందర్భంగా...