
రైల్వే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ప్రయాణీకులకు అనుకూలంగా ఉంచడానికి నిరంతరం దక్షిణ మధ్య రైల్వే జోన్ కృషి చేస్తోంది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్.. 2026 జూలై 17 నుండి ఆగస్టు 05 వరకు 20 రోజుల పాటు డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చెత్త వ్యతిరేక డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో భాగంగా.. రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త, ఉమ్ము వేస్తూ పట్టుబడిన 606 కేసులను అధికారులు నమోదు చేశారు. రైల్వే చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులకు జరిమానా విధించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ను టికెట్ తనిఖీ సిబ్బంది (టీటీఈలు), వాణిజ్య విభాగం అధికారులు సంయుక్తంగా చేపట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్, బేగంపేట్, లింగంపల్లి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్లలో సమర్థవంతంగా చేపట్టారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. రైల్వే ప్రయాణికుల్లో పరిశుభ్రతా అలవాట్లు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించే లక్ష్యంతో సికింద్రాబాద్ డివిజన్ వాణిజ్య శాఖ విజయవంతంగా చేపట్టిన యాంటీ-లిటరింగ్ ప్రత్యేక డ్రైవ్ను అభినందించారు. రైల్వే స్టేషన్లు, రైళ్లను శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో తమవంతు సహకారాన్ని అందించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను కోరుతోంది. ఇందుకోసం అందుబాటులో ఉంచిన చెత్తబుట్టలను వినియోగించాలని విజ్ఞప్తి చేస్తోంది. రైళ్లల్లో లేదా రైల్వే స్టేషన్లలో ఎక్కడపబడితే అక్కడ చెత్త వేసినా, ఉమ్మి వేసినా అధికారుల కంట పడితే జరిమానా విధిస్తారు. దీంతో రైల్వే ప్రయాణికులు దీనికి గమనించాలి. ఇతర ప్రయాణికులకు అసౌకర్యానికి కలిగించకుండా ప్రవర్తించాలి.
చెత్త లేదా ఉమ్మి వేస్తూ పట్టుబడితే అక్కడికక్కడే అధికారులు రూ.500 జరిమానా విధిస్తారు. జరిమానా కట్టకపోతే కేసులు కూడా నమోదు చేయవచ్చు. రైల్వే స్టేషన్లతో పాటు రైళ్ల లోపల చెత్తబుట్టలు అందుబాటులో ఉంటాయి. వీటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. వీటిని ఉపయోగించమని గుర్తుచేసే సాధారణ ప్రకటనలు, సైన్బోర్డులు కూడా రైల్వే స్టేషన్లు, రైళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటిని కాకుండా వేరేచోట చెత్త లేదా ఉమ్మి వేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది. దీంతో రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలు నియమ, నిబంధనలను పాటించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇటీవల కొన్నింటికి జరిమానాలను రైల్వేశాఖ పెంచింది. రైళ్లల్లో ధూమపానం, మద్యపానం, భిక్షాటన లాంటివి చేస్తే భారీగా జరిమానా విధిస్తారు. రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.