
సాధారణంగా మనకు తెలియని విషయం ఏదైనా ఉందంటే దానిపై ఆసక్తితో తెలిసిన వారి సూచనలు తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పెట్టుబడుల్లాంటి ఆర్థిక సంబంధిత విషయాలైతే కచ్చితంగా అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలని అనుకుంటారు. సరిగ్గా ఈ ఆలోచనలనే కేటుగాళ్లు వరంలా మార్చుకున్నారు. ముఖ్యంగా మనకు పెట్టుబడుల్లో సాయం చేస్తున్నట్లు నటించి మన సొమ్ము కొట్టెస్తున్నారు. మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఆర్థిక మోసానికి గురై స్టాక్ ట్రేడింగ్ స్కామ్లో రూ. 40.75 లక్షలను కోల్పోయాడు. ఇలాంటి ఘటనే నాగ్పూర్లోనూ చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు రూ.87.6 లక్షలు మోసం చేసినట్లు సమాచారం. అయితే థానేలో జరిగిన మోసంలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ట్రెడింగ్ స్కామ్ ఏంటి? మోసగాళ్లు మోసం చేయడానికి ఎంచుకున్న పద్ధతుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మోసగాళ్లు ఇలాంటి మోసాలను చేయడానికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారిని ఎంచుకుంటున్నారు. థానే విషయానికి వస్తే నిందితులు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని ఈ ఏడాది మార్చి నుంచి వేర్వేరు సందర్భాల్లో సంప్రదించి వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా చేశారు. అప్లికేషన్ను డౌన్లోడ్ చేయడం ద్వారా స్టాక్ ట్రేడింగ్లోకి ప్రవేశించమని సూచించారు. ఆ యాప్ ద్వారా అతను పెట్టుబడి పెట్టిన డబ్బు నిందితుడి ఖాతాలలోకి వెళ్లిందని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి రిటర్న్లతో పాటు పెట్టుబడి మొత్తాన్ని కోరినప్పుడు నిందితుడు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఎన్నిరోజులైనా నిందితుడు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
అలాగే నాగ్పూర్ కేసుకు సంబంధించిన పోలీసులు ఐపీసీ, ఐటీ యాక్ట్లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. 60 ఏళ్ల ఫిర్యాదుదారుడు తన కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక అప్లికేషన్పై ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత పెట్టుబడి పెట్టడంతో భారీ రాబడిని సంపాదించడం గురించి సందేశాన్ని అందుకున్నాడు. అందుకనుగుణంగా మొబైల్ ఫోన్లో అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, మే 16న ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి, వివిధ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన సలహాలను పొందడం ప్రారంభించాడు. ఫిర్యాదుదారుడు పెట్టుబడుల కోసం ఐఎంపీఎస్ ద్వారా మూడు కంపెనీల బ్యాంక్ ఖాతాలకు రూ. 87.6 లక్షలను బదిలీ చేశాడు. అయితే బాధితుడికి ఎలాంటి రిటర్న్లు రాకపోవడంతో తాను మోసపోయానని ఫిర్యాదుదారు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి