
ఆన్లైన్ మోసాల కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా, అదే సమయంలో బ్యాంకులకు సాంకేతికంగా సిద్ధమయ్యేందుకు అవకాశం కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-ఫ్రాడ్ ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనల అమలును ఆరు నెలలు వాయిదా వేస్తూనే.. ఫిర్యాదుల పరిష్కార గడువు, క్రెడిట్ కార్డు మోసాల్లో తాత్కాలిక రీఫండ్, అంతర్జాతీయ మోసాల బాధ్యత వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం దేశీయ ఈ-ఫ్రాడ్ కేసులను పరిష్కరించేందుకు బ్యాంకులకు 45 రోజుల గడువు, విదేశీ లావాదేవీలకు సంబంధించిన మోసాల పరిష్కారానికి 60 రోజుల గడువు ఇవ్వనుంది. గతంలో ప్రతిపాదించిన 30 రోజుల పరిమితికి బదులుగా ఈ గడువును పెంచింది. అయితే బ్యాంకులకు ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ, కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు మరిన్ని భద్రతా చర్యలను కూడా RBI తప్పనిసరి చేసింది.
క్రెడిట్ కార్డు మోసాల విషయంలో ఫిర్యాదు అందిన ఐదు రోజుల్లోనే వివాదాస్పద మొత్తాన్ని తాత్కాలికంగా ఖాతాలో జమ చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది. దీనిని “షాడో రివర్సల్” విధానంగా పేర్కొంది. దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకు బాధితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే అవకాశం ఉంటుంది. విదేశీ ఈ-ఫ్రాడ్ల విషయంలో కూడా RBI తన విధానాన్ని మార్చింది. విదేశాల్లో ఉన్న బ్యాంకుల నుంచి నష్టపరిహారం వసూలు చేయడం కష్టమనే కారణంతో, నష్టపరిహార భారం పంచుకునే విధానంలో మార్పులు చేసింది. అలాగే ఫిర్యాదు చేసిన కస్టమర్లు తప్పనిసరిగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఫిర్యాదు తప్పుడు లేదా డూప్లికేట్గా తేలితే అందుకున్న పరిహారాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కూడా RBI స్పష్టం చేసింది.
ఃఅయితే అన్ని రకాల వివాదాలు ఈ నిబంధనల పరిధిలోకి రావు. లోపభూయిష్ట వస్తువులు, సేవలు అందకపోవడం వంటి వినియోగదారుల ఫిర్యాదులు, అలాగే చెక్కులకు సంబంధించిన మోసాలు ఈ-ఫ్రాడ్ నిబంధనల కింద పరిగణించబోమని RBI స్పష్టం చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు సైబర్ మోసాల బాధితులకు వేగంగా న్యాయం అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.