
డిజిటల్ పేమెంట్స్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. RBI తీసుకున్న తాజా నిర్ణయాలతో ఆ బ్యాంక్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన ఆర్బిఐ, పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించింది. సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ బ్యాంక్ నిర్వహణ, ఆపరేషన్లు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా లేవని తేలింది.
అలాగే పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్కు సంబంధించిన కీలక షరతులను పాటించడంలో విఫలమైందని ఆర్బిఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ, మరిన్ని పరిమితులు విధించారు. ఇప్పటికే గతంలో కూడా ఆర్బిఐ ఈ బ్యాంక్పై పలు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 2022 మార్చి 11 నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిలిపివేయడం, అలాగే ఖాతాల్లో డిపాజిట్లు, వాలెట్ టాప్-అప్లు వంటి సేవలపై పరిమితులు విధించడం జరిగింది.
తాజా నిర్ణయాలతో ఈ ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. ఈ పరిణామాలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ఈ బ్యాంక్ సేవలను వినియోగిస్తున్న లక్షలాది కస్టమర్లపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల నిధుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్బిఐ తగిన చర్యలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి