
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా తొలి వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై చర్చించి ఆమోదం తెలుపుతారు. దేశంలోని ఆర్ధిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పెంచాలా..? తగ్గించాలా..? లేదా స్థిరంగా ఉంచాలా? అనేది నిర్ణయిస్తారు. ఆగస్ట్ 3వ తేదీన ఈ సమావేశాలు ప్రారంభమవ్వగా.. ఆగస్ట్ 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాలసీ రేట్లపై చర్చించనుండగా.. ఈ సారి కూడా యథాతధంగా ఉంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో లోన్లు తీసుకునేవారికి, రుణం పొంది ప్రతీ నెలా ఈఎంఐ చెల్లిస్తున్నవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం, దేశంలోని వాతావరణ పరిస్థితులు, ఎన్నివో ప్రభావం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఆరుగురు సభ్యుల కమిటీ ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఆర్ధిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై చర్చించనున్నారు. అయితే క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతుండటం, రిటైల్ ద్రవ్యోల్బణం సవాళ్లు కొనసాగుతున్న క్రమంలో రెపో రేటును యథాతధంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో లోన్లు తీసుకున్నవారికి ఊరట కలగనుంది. ఒకవేళ రెపో రేటు పెంచితే ఈఎంఐ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. గత నెలలో జరిగిన సమాశేంలో వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. 5.25 శాతం వద్దనే వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇక 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4.6 శాతం నుంచి 5.1 శాతానికి సవరించింది. ఇక జీడీపీ వృద్ది అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది.