Telugu News Business RBI Big Decision: Strict New Recovery Agent Rules Effective 2027
RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. 2027 నుంచి కొత్త రూల్స్!
RBI Big Decision: 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్.. రుణగ్రహీతలతో ఆర్థిక సంస్థలు వ్యవహరించే తీరులో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. వసూళ్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా జారీ చేసిన ఈ నిబంధనలు..
RBI Big Decision: డిజిటల్ రుణ యాప్ల వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలతో సామాన్య రుణగ్రహీతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలకు దిగింది. రుణగ్రహీతల హక్కులను కాపాడటంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్.. రుణగ్రహీతలతో ఆర్థిక సంస్థలు వ్యవహరించే తీరులో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. వసూళ్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా జారీ చేసిన ఈ నిబంధనలు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), ఆర్బీఐ పర్యవేక్షణలో ఉన్న ఆర్థిక సంస్థలన్నింటికీ వర్తిస్తాయి.
సమయం: రికవరీ ఏజెంట్లు ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల మధ్య మాత్రమే రుణం తీసుకున్న వ్యక్తులను సంప్రదించాలి. రుణగ్రహీత స్వయంగా కోరితే తప్ప, ఈ సమయాన్ని ఉల్లంఘించే అధికారం ఏజెంట్లకు లేదు.
వేధింపులపై నిషేధం: బెదిరింపులకు పాల్పడటం, అసభ్య పదజాలం వాడటం, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు చేసి భయపెట్టడం పూర్తిగా నిషేధం.
మినహాయింపు: కుటుంబంలో మరణం సంభవించినప్పుడు, వైద్య అత్యవసర పరిస్థితుల్లో, వివాహాల వంటి పండుగ వాతావరణంలో ఉన్నప్పుడు రుణగ్రహీతలను ఇబ్బంది పెట్టకూడదు.
గౌరవ భంగం రాకూడదు: రుణగ్రహీత ప్రతిష్టకు భంగం కలిగించేలా లేదా వారి కుటుంబ సభ్యులను భయపెట్టేలా వ్యవహరించడం చట్టవిరుద్ధం.
2. ముందస్తు నోటీసు తప్పనిసరి:
ముందస్తు సమాచారం: రికవరీ ఏజెంట్లు నేరుగా ఇంటికి వచ్చే ముందు కనీసం ఒక రోజు ముందే రుణగ్రహీతకు సమాచారం అందించాలి.
గుర్తింపు కార్డులు: ఏజెంట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, బ్యాంకు ఇచ్చే అధీకృత పత్రం (Authorization Letter), సంబంధిత నోటీసును కలిగి ఉండాలి. ఈ పత్రంలో బ్యాంకు గ్రీవెన్స్ (ఫిర్యాదుల) అధికారి వివరాలు ఉండాలి.
కలిసే వేదిక: ఏ ప్రదేశంలో కలవాలో ఎంచుకునే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది. చెప్పిన ప్రదేశానికి వారు రాకపోతేనే ఇల్లు లేదా కార్యాలయానికి వెళ్లాలి.
3. సోషల్ మీడియా వేధింపులపై ఉక్కుపాదం:
సామాజిక మాధ్యమాల్లో రుణగ్రహీతల ఫోటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్లు పెట్టి వారిని బహిరంగంగా అవమానించడం తీవ్ర నేరం.
డేటా ప్రైవసీ: వ్యక్తిగత వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వసూళ్లకు అవసరమైన కనీస సమాచారాన్ని మాత్రమే ఏజెంట్లకు ఇవ్వాలి. వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయితే దానికి పూర్తి బాధ్యత బ్యాంకులే వహించాల్సి ఉంటుంది.
4. ఫోన్లు/డిజిటల్ పరికరాల లాకింగ్పై కఠిన షరతులు:
నిర్దిష్ట రుణాలకే పరిమితి: స్మార్ట్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ కొనుగోలుకు తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించకపోతే మాత్రమే ఆ పరికరాన్ని రిమోట్గా స్తంభింపజేసే (Locking) హక్కు ఉంటుంది. సాధారణ వ్యక్తిగత రుణాల కోసం వీటిని లాక్ చేయకూడదు.
గడువు నిబంధన: EMI ఆలస్యమైతే, బాకీ పడిన 30 రోజుల తర్వాతే పాక్షిక నియంత్రణలు విధించాలి. 60 రోజులు దాటితేనే పూర్తిస్థాయిలో లాక్ చేయాలి.
అత్యవసర సేవలు: ఫోన్ లాక్ చేసినప్పటికీ ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, అత్యవసర సేవలు (Emergency Services) పనిచేస్తూనే ఉండాలి. గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు) ఉపాధికి అవసరమైన యాప్లు అందుబాటులో ఉండాలి.
ఆలస్య రుసుము పరిహారం: బాకీ చెల్లించిన 1 గంట లోపు లాక్ను తొలగించాలి. ఆలస్యమైతే.. ప్రతి గంటకు ₹250 చొప్పున బ్యాంకులు రుణగ్రహీతకు পরিహారం చెల్లించాల్సి ఉంటుంది.
5. బ్యాంకులదే పూర్తి బాధ్యత:
వసూళ్ల ప్రక్రియను వేరే ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ, ఉల్లంఘనలు జరిగితే బ్యాంకులదే పూర్తి బాధ్యత.
ప్రతి రికవరీ కాల్ను రికార్డు చేయడంతో పాటు, ఆ ఫోన్ నంబర్, మాట్లాడిన సమయాలను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి.
రికవరీ ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. ఏజెంట్లకు ఇచ్చే ఇన్సెంటివ్లు/ప్రోత్సాహకాలు రుణగ్రహీతలను వేధించేలా ప్రోత్సహించేవిగా ఉండకూడదు.