Ratan Tata Passed Away Live: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత.. కన్నీరు పెట్టుకుంటున్న యావత్ భారతం
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు..
LIVE NEWS & UPDATES
-
‘నేను జీవించి ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను…’ రతన్ టాటా ఎమోషన్ మాటలు
రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కుక్కల పట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. తనకు కుక్కల పట్ల ఉన్న ప్రేమ లోతైనదని, తాను జీవించి ఉన్నంత వరకు ఈ ధోరణి కొనసాగుతుందని చెప్పాడు. రతన్ టాటాకు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉందంటే.. జంతువుల కోసం ఏకంగా ఓ ఆసుపత్రే కట్టించాడు. దీనికి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ అనే పేరు కూడా పెట్టారు. టాటా ట్రస్ట్స్ జంతు ఆసుపత్రిని 165 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇది ఐదు అంతస్తుల భవనం.
-
‘టాటా’లకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. ఆసక్తికర విశేషాలు
రతన్ టాటా తండ్రి పేరు నావల్ టాటా. అయితే నావల్ టాటా కంటే ముందు అతని పూర్వికులెవరికీ ‘టాటా’ అనే ఇంటిపేరు లేదు. నావల్ టాటాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు JN పెటిట్ పార్సీ అనాథాశ్రమంలో చదువుతుండగా అనుకోకుండా ఆయన పేరులో ‘టాటా’ చేరింది. 1917లో ప్రసిద్ధ పార్సీ పారిశ్రామికవేత్త, ప్రజా సేవకుడు జమ్సెట్జీ నసర్వాన్జీ టాటా కుమారుడు సర్ రతన్ టాటా, ఆయన భార్య నవాజ్బాయి ఆ అనాథ అశ్రమానికి వచ్చారు. అక్కడ ఆమె నావల్ని చూసింది. నవాజ్బాయికి నావల్ తెగ నచ్చేశాడు. అంతే.. అతనిని తన కొడుకుగా స్వీకరించింది. ఆ తర్వాత ‘నవల్’ టాటా కుటుంబంలో చేరి ‘నవల్ టాటా’ అయ్యాడు.
-
-
టాటా గ్రూప్ ఆప్ కంపెనీలకు తర్వాత వారసుడు ఎవరంటే..
రతన్ టాటాకు సోదరులు లేరు. ఆయన తండ్రి నావల్ టాటా రెండో భార్య కుమారుడు నోయెల్ టాటా మాత్రమే ఇప్పుడు ఉన్నాడు. రతన్ టాటాకి సవతి సోదరుడైన ఈయనకు ముగ్గురు సంతానం. మాయ, నెవిల్లే, లేహ్ టాటా. వీరిలో ఒకరు టాటా గ్రూప్ సంస్థలకు వారసులయ్యే అవకాశం ఉంది.
-
పెళ్లి పీటలెక్కని నాలుగు ప్రేమలు.. బాలీవుడ్ నటితో రతన్ టాటా లవ్ ట్రాక్
బాలీవుడ్ నటి సిమి గ్రేవాల్తో రతన్ టాటా కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిచింది. రతన్ టాటా నటి సిమి గ్రేవాల్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. తాను నలుగురితో ప్రేమలో పడ్డానని, అయితే ప్రతిసారీ అదృష్టం కలిసిరాలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రతన్ టాటా పెళ్లి చేసుకోవాలనుకున్న నటి సిమి గ్రేవాల్ కూడా పలుమార్లు వీరి లవ్ స్టోరీని మీడియాకు తెలిపారు. సిమి గ్రేవాల్ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో మాత్రమే కాకుండా, మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, జామ్నగర్ మహారాజు, వ్యాపారవేత్తతో కూడా లవ్ ట్రాక్ నడిపినట్లు తెలుస్తోంది.
-
జీవితాంతం రతన్టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రతన్ టాటాకు సొంత వారసులు లేరు. అందుకు కారణం ఆయన ఆజన్మ బ్రహ్మచారి. వయసులో ఉన్నప్పుడు అయకు వరుసగా నాలుగు సార్లు లవ్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించకుండా వ్యాపారంపై పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా స్వయంగా తెలిపారు.
-
-
అమెరికాలో చదివినా.. సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా
1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్నకు రతన్ టాటా ఛైర్మన్గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రకటించింది.
-
టాటా గ్రూప్ సంస్థలేకాదు అనేక స్టార్టప్ యాప్లను సైతం స్థాపించిన రతన్ టాటా
టాటా గ్రూప్ను దాదాపు రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పారిశ్రామిక వేత్తగానే కాకుండా దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. అనేక స్టార్టప్లను రతన్టాటా స్థాపించి, ప్రోత్సహించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా యువతకు దిశానిర్ధేశం చేయడంలో ఆయన గొప్ప దార్శనికుడు అని చెప్పవచ్చు. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన గొప్ప వ్యాపార దిగ్గజంగా ఆయన నిలిచారు.
-
-
‘దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త రతన్ టాటా’: ప్రధాని మోదీ సంతాపం
రతన్టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ, న అమిత్షా, రాజ్నాథ్, కిషన్రెడ్డితో సహా పలువురు సంతాపం తెలిపారు. భారత్ దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందని రాష్ట్రనతి ముర్ము అన్నారు. దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త రతన్టాటా అని ప్రధాని మోదీ కొనియాడారు. సమాజహితం కోసం రతన్టాటా పనిచేశారని మోదీ అన్నారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రతన్టాటా వాణిజ్యరంగానికి ఆదర్శమూర్తి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రతన్టాటా గొప్ప మానవతావాది అని కేటీఆర్ పేర్కొన్నారు.
-
మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్టాటా అంత్యక్రియలు
రతన్టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఉ.10.30 గంటల నుంచి.. ముంబై-NCPA గ్రౌండ్లో రతన్టాటా భౌతికకాయం ఉంచనున్నట్లు రతన్ టాటా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వ లాంఛనాలతో రతన్టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
రతన్టాటాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో సత్కరించిన భారత ప్రభుత్వం
నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం రెండు అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. 2000లో పద్మభూషణ్ అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది.
-
టాటా గ్రూప్ చైర్మన్గా రెండు దశాబ్ధాల కాలంపాటు రతన్ టాటా సేవలు
1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా సేవలు అందించారు. 2016-17 మధ్య తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. టాటా చారిటబుల్ ట్రస్టులకు కూడా రతన్టాటా చైర్మన్గా వ్యవహరించారు. అనేక స్టార్టప్లను ప్రోత్సహించిన రతన్టాటా.. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు.
-
రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం
దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన వారు చాలా అరుదని అన్నారు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు తెలిపారు.
-
‘..యావత్ దేశానికి తీరని లోటు’ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
-
ముంబైలోని NCPAలో రతన్ టాటా పార్థివ దేహం.. ప్రజల సందర్శనార్ధంఉదయం 10.30 గంటల నుంచి అనుమతి
ప్రజల సందర్శనార్ధం రతన్ టాటా పార్థివ దేహాన్ని గురువారం ముంబైలోని ఎన్సీపీఏలో ఉదయం 10.30 గంటల నుంచి ఉంచనున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
-
నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంతాప దినం
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు గురువారం (అక్టోబర్ 10) సంతాప దినాలుగా ప్రకటించాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్ వేధికగా తెలిపారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కూడా రాష్ట్రంలో ఒకరోజు సంతాప దినాలు ప్రకటించారు. జార్ఖండ్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును అందించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ పద్మవిభూషణ్ రతన్ టాటా మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటించారు’ అని ‘X’లో ఒక పోస్ట్లో రాశారు.
-
శోకసంద్రంలో యావత్ దేశం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం
చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. ఆయన మృతితో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
-
ప్రభుత్వ లాంఛనాలతో నేటి సాయంత్రం అంత్యక్రియలు
ఈ రోజు సాయంత్రం రతన్ టాటా పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
ముంబై, అక్టోబర్ 10: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిషాతో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్స్ సంస్థలకు ఛైర్మన్గా వ్యవహరించిన రతన్ టాటా.. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్గా వ్యవహరించారు. రతన్ టాటా సేవలను గానూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ (2000), రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ (2008)తో సత్కరించింది.
Published On - Oct 10,2024 8:45 AM