Narendra Modi: ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి.. వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు..

|

Sep 16, 2022 | 9:37 AM

పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. దీనిలో భాగంగా పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. ఇప్పుడు వస్తున్న..

Narendra Modi: ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి.. వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు..
Pm Narendra Modi
Follow us on

Narendra Modi: పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. దీనిలో భాగంగా పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. అలాగే ఇప్పుడు వస్తున్న వాహనాలు పర్యావరణ హితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సందర్భంలో భారత వాహన తయారీదార్ల సంఘానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) కీలక సూచనలు చేశారు. పర్యావరణ హితంగా రూపొందుతున్న వాహనాల్లో కొత్తదనం తీసుకురావాలని.. అదే సమయంలో ప్రయాణికుల భద్రతకు అమిత ప్రాధాన్యమివ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత వాహన తయారీదార్ల సంఘం (SIAM) వార్షిక సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి ఓ లేఖను పంపించారు. హరిత వాహనాల ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు భారత్‌ స్వావలంబనను సాధించవచ్చని ఈసందర్భంగా ఆ లేఖలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అమృత్‌ కాల్‌ అనేది ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఓ అవకాశంగా చెప్పారు. దీనికి వాహన రంగం కూడా మినహాయింపు కాదన్నారు. కొత్త అవకాశాలు, ఉద్యోగాల సృష్టి ద్వారా ఆర్థిక వ్యవస్థకు అన్ని దిక్కుల నుంచీ వృద్ధిని వాహన రంగం అందిస్తోందని తెలిపారు. దేశంలో ఒక అంతర్జాతీయ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం తయారీదార్లను ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

ఈసదస్సును ఉద్దేశించి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడుతూ.. కారు ప్రమాదంలో టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణించిన అనంతరం రోడ్డు భద్రతపై ఆందోళనలు తీవ్రమయ్యాయన్నారు. వాహన తయారీదార్లు నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, వ్యయాలను తగ్గించుకుని, వినియోగదార్లకు మరింత భద్రతను అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. దిగుమతులను తగ్గించి.. ఎగుమతులు పెంచాలని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు.

భారత వాహన తయారీదార్ల సంఘం (SIAM) అధ్యక్షుడిగా 2022-23 కాలానికి వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ ఎండీ వినోద్‌ అగర్వాల్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేశ్‌ చంద్ర, కోశాధికారిగా దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ ఎండీ సత్యకమ్‌ ఆర్యను ఎన్నుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..