
దేశంలోని రైతులకు భారీ గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 నుండి 2030-31 వరకు ఈ పథకం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం మొత్తం రూ.3.15 లక్షల కోట్లు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీఎం కిసాన్ పథకం 2031 వరకు యథావిధిగా కొనసాగనుంది.
పీఎం కిసాన్ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. మూడు విడతలుగా వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఆధార్ ధృవీకరణ, డిజిటల్ ధృవీకరణ, పటిష్టమైన డీబీటీ (DBT) వ్యవస్థ ద్వారా ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అమలు చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడులను పెంచుకోవడానికి, వారి జీవనోపాధిని బలోపేతం చేసుకోవడానికి ఈ ఆర్ధిక సాయం ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 23 విడతల ద్వారా రూ.4.47 లక్షల కోట్లకు పైగా నిధులను రైతులకు కేంద్ర అందించింది. ఇటీవల 23వ విడత కింద రూ.18,984 కోట్లకు పైగా విడుదల చేయగా. దీని ద్వారా 9.49 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు.
పీఎం కిసాన్ పథకం కింద మహిళా రైతులకు రూ.1.06 లక్షల కోట్లకు పైగా అందాయి. పీఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్నవారిలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు మహిళా రైతు ఉన్నారు. పీఎం కిసాన్ కింద అందించిన సాయాన్ని రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చు. 92 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ప్రభుత్వం అందించే సొమ్మును వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ పెట్టుబడి కోసం వినియోగించుకున్నట్లు తెలింది. సుమారు 85% మంది లబ్ధిదారులు తమ వ్యవసాయ ఆదాయం మెరుగుపడిందని, అనధికారిక రుణాలపై ఆధారపడటం తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో అతిపెద్ద పథకంగా ఇది నిలిచింది. కాగా పీఎం కిసాన్ 24వ విడత సొమ్ము అక్టోబర్లో విడుదలయ్యే అవకాశముంది.