
దేశంలో ఇంధన ధరల పెరుగుదల మళ్లీ తీవ్రరూపం దాల్చింది. తాజాగా మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిరంతరం పెరుగుతున్న ఈ ధరలు సామాన్యుడి జేబుకు గట్టి దెబ్బ కొడుతున్నాయి. ఇంటి బడ్జెట్లను పూర్తిగా కుప్పకూలుస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై ఈ పెరుగుదల ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కచ్చితంగా ఎవరు నిర్ణయిస్తారు. ఆ ప్రక్రియ ఏమిటనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
చాలా మంది అనుకుంటున్నట్లు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే ప్రత్యక్ష అధికారం ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు లేదు. వీటిని ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయిస్తాయి. భారత ప్రభుత్వం 2010లో పెట్రోల్ ధరలను, 2014లో డీజిల్ ధరలను అధికారికంగా నియంత్రణల నుండి తొలగించింది. దీని అర్థం ఇంధనం రోజువారీ ధరపై ప్రభుత్వం తన ప్రత్యక్ష నియంత్రణను వదులుకుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లోని హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలను నిర్ణయించుకోవడానికి చమురు కంపెనీలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.
దేశం తన మొత్తం ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లోని పరిణామాలు దేశీయ ధరలపై ప్రత్యక్షంగా, గణనీయంగా ప్రభావం చూపుతాయి. అయితే వినియోగదారులకు లభించే తుది చిల్లర ధర కేవలం ముడి చమురు ధరపై మాత్రమే కాకుండా ఒక సంక్లిష్టమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో అంతర్జాతీయ ముడి చమురు ధర, అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మార్పిడి రేటు, ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే రవాణా, రిఫైనరీ ఛార్జీలు, అలాగే పెట్రోల్ పంప్ ఆపరేటర్ల లాభమైన డీలర్ కమీషన్ వంటి కీలక అంశాలు ఇమిడి ఉంటాయి.
దేశంలో ఇంధనం తుది ధర అంతలా పెరగడానికి దాని ప్రాథమిక ధరపై విధించే పన్నులే అతిపెద్ద కారకం. పెట్రోల్, డీజిల్పై ప్రధానంగా రెండు రకాల పన్నులు విధిస్తారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ఒకటి కాగా, ఇది దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలకు అనుగుణంగా విధించే వ్యాట్ లేదా సెస్ కూడా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి వేర్వేరు వ్యాట్ రేటు ఉండటం వల్ల దేశంలో ఇంధన ధరలు రాష్ట్రానికీ, నగరానికీ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ, ముంబై మధ్య పెట్రోల్ ధరలలో వ్యత్యాసం కేవలం రవాణా ఖర్చుల వల్ల మాత్రమే కాకుండా ఆ రెండు రాష్ట్రాల మధ్య పన్నుల నిర్మాణంలో ఉన్న తేడాల వల్ల కూడా ఏర్పడుతుంది.
సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు కొరత ఏర్పడినప్పుడు, ప్రపంచ యుద్ధం లేదా రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడినప్పుడు దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా ప్రపంచ మార్కెట్లో మాంద్యం ఏర్పడినా లేదా ముడిచమురు చమురు చౌకగా మారినా ధరలు తగ్గుముఖం పడతాయి. వీటికి అదనంగా దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి లేదా ప్రజలకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పన్నులను తగ్గిస్తుంటాయి. దీనివల్ల కూడా సామాన్యుడికి ధరల భారం తగ్గి ఇంధనం చౌకగా మారుతుంది.