
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయా..? ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చేందుకు కేంద్రం మరోసారి ధరలను పెంచనుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తుున్నాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరగడం, రూపాయి విలువ పతనంతో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు చమురు సంస్థలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో కంపెనీలపై భారం పడకుండా ఆదాయం కూడా తగ్గుతుంది. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల నష్టాలను కవర్ చేసేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇంధనంపై విధించే దిగుమతి సుంకం, ఎక్సైజ్ సుంకాలను తగ్గించగా.. ధరలను పెంచుకునేందుకు కూడా అవకావం ఇచ్చింది.
కేంద్రం గత నెలలో విడతల వారీగా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.7.5 మేర పెంచింది. అయినా పెట్రోల్ కంపెనీల నష్టాలు తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ధరలను కేంద్రం త్వరలో మరింత పెంచనుందని వార్తలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై అదనంగా మరో రూ.5 పెంచే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ధరలను సవరించిన తర్వాత కూడా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్పై రూ.5.5, డీజిల్పై రూ.4.5 మేర నష్టపోతున్నాయి. దీంతో ఈ నష్టాల నుంచి బయటపడాలంటే ధరలను మరింత పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. త్వరలో ధరలను పెంచే అవకాశముందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ ధరలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే సుమారు ప్రతీ సిలిండర్పై రూ.680 లోటు ఉంది. దీంతో వాణిజ్య సిలిండర్ ధరలను గత మూడు నెలలుగా పెంచుతూ వస్తోన్నారు. వచ్చే నెలలో కూడా మరోసారి పెంచే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఇక ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్పై కూడా కంపెనీలు రోజుకు రూ.93 కోట్ల నష్టపోతున్నాయి. దీంతో ఏటీఎఫ్ ధరలపై కూడా ఒత్తిడి కొనసాగుతోంది. అటు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.10 వరకు పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా అంచనా వేసింది. క్రిసిల్ అంచనా ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.7.5 పెరిగితే ద్రవ్యోల్బణంపై 36 బేసిస్ పాయింట్ల మేర పడుతుంది. రూ.10 పెరిగతే 48 బేసిస్ పాయింట్ల వరకు ద్రవ్యోల్బణంపై ప్రభావం పడవచ్చని అంచనా వేసింది. ఆయిల్ కంపెనీలు నష్టాలను మూటకట్టుకోవడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గకపోవడంతో ఇంధన త్వరలో పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.