Post Office: పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఈ పనులు చేయాలంటే పాన్ తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు..
కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టాఫీసుల్లో ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ మేరకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ను వర్తింపచేయాలని నిర్ణయించింది. నగదు లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పోస్టాఫీసులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రతీ గ్రామానికి పోస్టాఫీసు సేవలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీలు పుట్టుకురావడంతో పోస్టాఫీసులకు డిమాండ్ తగ్గింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వ డాక్యుమెంట్స్, బ్యాంక్ కార్డులు వంటివి పోస్టాఫీస్ ద్వారానే పొందే అవకాశముంది. ఇక పోస్టల్ శాఖ బ్యాంకింగ్ సేవలను కూడా మెరుగుపరుస్తుంది. కేవలం స్పీ్డ్ పోస్టులు లాంటివే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పోస్టాఫీస్ బ్యాంకింగ్ సేవలకు గ్రామాల్లో డిమాండ్ పెరుగుతోంది. పోస్టాఫీసుల్లో లక్షలాది మంది అకౌంట్లు కలిగి ఉన్నారు.
పాన్ తప్పనిసరి
ఈ క్రమంలో పోస్టాఫీసుల రూల్స్లో మార్పులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 ప్రకారం పోస్టాఫీసుల్లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడానికి తప్పనిసరిగా కస్టమర్లు పాన్ వివరాలు అందించాలని కేంద్రం తెలిపింది. సేవింగ్స్ అకౌంట్స్, డిపాజిట్ స్కీముల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పాన్ కార్డు మర్చిపోతే ఫారం 97 సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్లు, నగదు విత్ డ్రా, టైమ్ డిపాజిట్లు, పెట్టుబడి స్కీమ్స్ ఇలా అన్నీంటికీ పాన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కమ్ రూల్స్ 237,211,161,160,159 ప్రకారం పాన్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పోస్టాఫీస్ ఆర్డర్ నెం.02/2026 ఆధారంగా ఈ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది.
పాన్ లేకపోతే..
పాన్ లేకపోతే ఫారం 97 అందించాలి. ఇందులో పేరు, అడ్రస్, ట్రాన్సాక్షన్ వివరాలు అన్నీ అందించాలి. అంతేకాకుండా వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అందించాల్సి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ను భద్రపరిచే బాధ్యత పోస్టాఫీసులపై ఉంటుంది. అలాగే పోస్టాఫీసు స్కీముల్లో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు కావాలంటే ఫారం 121 సమర్పించాలి. గతంలో 15G, 15H ఉండేవి. ఈ రికార్డులను ఏడేళ్ల పాటు పోస్టాఫీసులు భద్రపర్చాల్సి ఉంటుంది. డిజిటల్గా అప్డేట్ చేసేంతవరకు ఫారంలను కొనసాగించాలని కేంద్రం పేర్కొంది. ఈ నిబంధనలను అన్ని పోస్టాఫీసులు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మొన్నటివరకు పోస్టాఫీసుల్లో పాన్ అవసరం పెద్దగా ఉండేది కాదు. దీంతో పాన్ ఎక్కువమంది తీసుకెళ్లేవారు కాదు. కానీ ఇక నుంచి పోస్టాఫీసులో ఆర్ధిక లావాదేవీల కోసం వెళ్తుంటే పాన్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే ఆర్దిక కార్యకలాపాల నిర్వమణలో ఇబ్బందులకు గురవుతారని చెప్పవచ్చు.
