Onion Export: రైతులకు పెద్ద ఉపశమనం.. ఉల్లి ఎగుమతులపై కీలక నిర్ణయం

|

Sep 14, 2024 | 7:17 AM

మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి, బాస్మతి బియ్యం ఎగుమతులకు సంబంధించిన కనీస ధరను శుక్రవారం ఎత్తివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాలకు వీటి ఎగుమతులకు ఊతమివ్వడానికే కాకుండా రైతుల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది...

Onion Export: రైతులకు పెద్ద ఉపశమనం.. ఉల్లి ఎగుమతులపై కీలక నిర్ణయం
Follow us on

మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి, బాస్మతి బియ్యం ఎగుమతులకు సంబంధించిన కనీస ధరను శుక్రవారం ఎత్తివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాలకు వీటి ఎగుమతులకు ఊతమివ్వడానికే కాకుండా రైతుల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ఈ సమాచారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అందించింది. రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి సగటు ధర రూ.58గా కొనసాగుతోంది. భారతదేశంలో ఉల్లి గరిష్ట ధర కిలోకు రూ.80. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉల్లి ధరలపైనా ప్రభావం చూపనుంది. ఉల్లి ఎగుమతిపై కనీస ఎగుమతి ధర (MEP) షరతును తక్షణమే తొలగించినట్లు డిజిఎఫ్‌టి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షల్ని తొలగించిన మోదీ సర్కార్.. ఇదే సమయంలో బాస్మతి బియ్యంపైనా కనీస ఎగుమతి ధర నిబంధన తొలగించినట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది:

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌లో ఉల్లి ఎగుమతి విధానాన్ని తక్షణమే సవరిస్తున్నట్లు తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, MEP కింద టన్నుకు $ 550 పరిమితి నుండి మినహాయింపు ఉంటుంది. అయితే, గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31, 2023 వరకు భారతదేశం ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. అంతకు ముందు, డిసెంబర్ 8, 2023 న, ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతిని నిషేధించారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉల్లిని అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రం మహారాష్ట్ర కావడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రైతులకు ఉల్లిని ఎగుమతి చేసేందుకు దోహదపడుతుంది.

ఉల్లి నిల్వ 38 లక్షల టన్నులు:

ప్రభుత్వ నిల్వలో ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ల వద్ద 4.7 లక్షల టన్నుల ఉల్లి బఫర్‌ స్టాక్‌ ఉందని చెబుతున్నారు. NCCF, NAFED సహకారంతో ప్రభుత్వం తన దుకాణాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిపాయలను రిటైల్ చేస్తోంది. ఖరీఫ్ (వేసవి) సీజన్‌లో విత్తిన విస్తీర్ణం గత నెల వరకు వేగంగా పెరిగినందున రాబోయే నెలల్లో ఉల్లి లభ్యత, ధరల అంచనా సానుకూలంగా ఉందని గత వారం వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. 2.9 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ విస్తీర్ణం 1.94 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇది కాకుండా, రైతులు, వ్యాపారుల వద్ద ఇంకా 38 లక్షల టన్నుల ఉల్లి నిల్వ ఉందని ఆయన చెప్పారు.

ఉల్లి ధరల పెరుగుదల నుండి జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ, ముంబైలోని వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం సెప్టెంబర్ 5 న కిలోకు 35 రూపాయల రాయితీ రేటుతో ఉల్లిపాయల రిటైల్ అమ్మకం మొదటి దశను ప్రారంభించింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) తమ స్టోర్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా రిటైల్ విక్రయాలను ప్రారంభించాయి. ప్రభుత్వం తరపున 4.7 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్‌గా ఉంచుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి