డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌కు శ్రీకారం.. ఎన్‌ఎస్‌ఈలో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ప్రారంభం!

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌ (EGR) లైవ్ ట్రేడింగ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు, విక్రయించే ఈ కొత్త విధానం, భౌతిక బంగారంగా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. గోల్డ్ ETFల కంటే ఇది ప్రత్యేకమైనది.

డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌కు శ్రీకారం.. ఎన్‌ఎస్‌ఈలో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ప్రారంభం!
Nse Egr

Updated on: May 19, 2026 | 6:58 AM

నేషనల్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌ (EGR) విభాగంలో లైవ్ ట్రేడింగ్‌ను ప్రారంభించడం బంగారం పెట్టుబడుల్లో ఒక కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. మే 16న విజయవంతంగా మాక్ ట్రేడింగ్ నిర్వహించిన తర్వాత, మే 18 నుంచి అధికారికంగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా అన్ని వ్యవస్థలు సమర్థంగా పనిచేయడంతో, లైవ్ ట్రేడింగ్‌ను ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌ అంటే డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసి, ట్రేడ్ చేసే విధానం. ఇవి 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారంతో అందుబాటులో ఉంటాయి.

ముఖ్యంగా పెట్టుబడిదారులు తమ డిజిటల్ గోల్డ్ హోల్డింగ్స్‌ను అవసరమైతే భౌతిక బంగారంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే విషయమే గోల్డ్ ETFలతో పోలిస్తే EGRలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. గోల్డ్ ETFలు కేవలం బంగారం ధరల ఆధారిత పెట్టుబడి సాధనాలు మాత్రమే కాగా, EGRలు నిజమైన భౌతిక బంగారంపై యాజమాన్య హక్కును ఇస్తాయి. ఈ వ్యవస్థను సెబీ నియంత్రిస్తోంది. ట్రేడింగ్ వేదికను ఎన్‌ఎస్‌ఈ అందిస్తుండగా, సెటిల్‌మెంట్ ప్రక్రియను ఎన్‌సీఎల్ నిర్వహిస్తుంది. డిపాజిటరీలు EGRలను డీమ్యాట్ రూపంలో భద్రపరుస్తాయి. ఇక వాల్ట్ మేనేజర్లు భౌతిక బంగారం నిల్వ, డిపాజిట్, ఉపసంహరణ వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.

ఈజీఆర్‌లతో బంగారం మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన ధర విధానం అమలుకావడానికి ఇది దోహదపడుతుంది. స్టాక్ మార్కెట్ తరహాలో కొనుగోలుదారులు, అమ్మకందారులు బిడ్‌లు పెట్టడం ద్వారా ధరలు నిర్ణయించబడతాయి. దీని వల్ల ప్రాంతాలవారీగా ఉండే ధరల వ్యత్యాసాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అహ్మదాబాద్‌, ముంబైలో వాల్టింగ్ కేంద్రాలు పనిచేస్తుండగా, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులలో కూడా సేవలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో ఈ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు విస్తరించాలనే ప్రణాళికను ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి నగల వ్యాపారులు, రిఫైనరీల వరకు అందరికీ ఉపయోగపడేలా ఈ కొత్త వ్యవస్థ రూపొందించబడింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us