DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ మూడు శాతం పెంచే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో సాధారణ ధరలను ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ సహాయపడుతుంది. డీఏను జనవరి నుండి జూన్ వరకు, జూలై నుంచి డిసెంబర్ వరకు సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. ఈ నేపథ్యంలో జూలై సవరణ గురించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ మూడు శాతం పెంచే అవకాశం
Da Hike 2025

Updated on: May 16, 2025 | 8:00 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది మార్చిలో డీఏను 2 శాతం పెంచింది. ఈ పెంపు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది, దీని వల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందారు. ఈ సవరణతో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది. మునుపటి డీఏ పెంపు జూలై 2024లో చేశారు. ఆ సమయంలో దీనిని 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై-డిసెంబర్ 2025 కాలానికి తదుపరి డీఏ పెంపు నవీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది 7వ వేతన సంఘం కింద షెడ్యూల్ చేసిన చివరి డీఏ భత్యం పెంపు అవుతుంది. ఇది అక్టోబర్/నవంబర్ నాటికి ప్రకటిస్తారని భావిస్తున్నారు. డీఏ పెంపును సంవత్సరానికి రెండుసార్లు ప్రకటిస్తారు – మార్చి/ఏప్రిల్‌లో ఒకసారి, అక్టోబర్/నవంబర్‌లో రెండవసారి ప్రకటిస్తారు.

కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో మార్చి 2025 సంవత్సరానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటాను విడుదల చేసింది. ఈ డేటాలో డీఏ పెంపుపై కొత్త ఆశలు కల్పించారు. మార్చిలో సీపీఐఐడబ్ల్యూ సూచిక 0.2 పాయింట్లు పెరిగి 143.0కి చేరుకుంది. సీపీఐఐడబ్ల్యూ సూచిక అంటే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక. ఇది భారతదేశంలోని పారిశ్రామిక కార్మికుల ద్రవ్యోల్బణాన్ని ప్రత్యేకంగా వస్తువులు, సేవల బుట్ట ధరలలో మార్పులను ట్రాక్ చేయడం ద్వారా కొలుస్తుంది. డీఏ పెంపు గణన సీపీఐఐడబ్ల్యూ డేటాతో ముడిపడి ఉన్నందున ఇది సానుకూల సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఏడో వేతన కమిషన్ కింద 12 నెలల సీపీఐఐడబ్ల్యూ సగటును తీసుకొని డీఏ / డీఆర్ పెంపును లెక్కిస్తారు. గతంలో అంటే నవంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఏఐ సీపీఐఐడబ్ల్యూ ఆధారంగా ద్రవ్యోల్బణం సంఖ్యలలో నిరంతర తగ్గుదల కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ మారినందున, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సీపీఐఐడబ్ల్యూ ఆధారంగా మంచి డీఏ పెంపును పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

డీఏ పెంపు ఎంత?

మార్చి 2025 వరకు సగటు ఆధారంగా, అంచనా వేసిన డీఏ 57.06 శాతానికి చేరుకుంది. సీపీఐఐడబ్ల్యూ గణాంకాలు ఏప్రిల్, మే, జూన్ 2025లో స్థిరంగా ఉంటే లేదా కొద్దిగా పెరిగితే ఈ సగటు 57.86 శాతానికి పెరగవచ్చు. సాధారణంగా డీఏ పెంపు శాతం సమీప పూర్ణ సంఖ్యకు రౌండ్ చేస్తారు. కాబట్టి సగటు 57.50% మించితే డీఏ 58 శాతానికి పెరగవచ్చు. అది 57.50% కంటే తక్కువగా ఉంటే డీఏ 57 శాతం వద్దనే ఉండవచ్చు. అంటే జూలై 2025లో డీఏ లో 2% లేదా 3% పెరుగుదల ఉండవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us